ఆ ముగ్గురు ప్లేయర్లను కొనుగోలు చేసే ఆలోచనలో!

     Written by : smtv Desk | Tue, Dec 10, 2019, 08:00 AM

ఐపీఎల్‌లో ముంబై.. ఈసారి వేలంలో ముగ్గురు ప్లేయర్లను కొనుగోలు చేసి జట్టుును మరింత పటిష్టం చేసుకోవాలని భావిస్తోంది. ఆ ముగ్గురు ఎవరంటే... ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌ది ప్రత్యేకస్థానం ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రికార్డు స్థాయిలో నాలుగుసార్లు విజేతగా నిలిచిన ఏకైక జట్టు ముంబై ఇండియన్స్. 2013 నుంచి వరుసగా రెండేళ్లోకసారి విజేతగా నిలిచిన అరుదైన రికార్డు తన సొంతం చేసుకుంది. రోహిత్ శర్మ నాయకత్వంలో పటిష్టంగా ఉన్న ఈ జట్టు రాబోయే సీజన్ కోసం అన్ని అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంది. ఈ ఏడాది పది మంది ప్లేయర్లను రిలీజ్ చేసిన ముంబై.. పేసర్ ట్రెంట్ బౌల్ట్‌ను జట్టులోకి తెచ్చుకుంది. అలాగే ఈసారి జరిగే వేలంలో కొన్ని బలహీనతలపై దృష్టి సారించి మరింత పటిష్టం కావాలని యోచిస్తోంది. ఈక్రమంలో ఈసారి ముగ్గురు ప్లేయర్లను జట్టులోకి తీసుకోవాలను కుంటున్నట్లు తెలుస్తోంది. వారి వివరాలు...2018లో సీనియర్ ఆఫ్‌స్పిన్నర్ హర్భజన్ సింగ్‌ను జట్టు నుంచి తప్పించాక యువకులైన ఇద్దరు స్పిన్నర్లు మయాంక్ మార్కండే, రాహుల్ చహర్‌లను జట్టులోకి తీసుకోంది. అయితే చాహర్ జట్టులో చోటు సుస్థిరం చేసుకోగా.. మయాంక్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌కు బదిలీ చేసింది. అక్కడి నుంచి రాజస్థాన్ రాయల్స్‌కు మార్కండే చేరాడు. అయితే జట్టులో ఏకైక స్పిన్నర్ చాహర్‌కు తోడుగా పార్ట్‌టైమ్ స్పిన్నర్లు జయంత్ యాదవ్, క్రునాల్ పాండ్యా, అనుకుల్ రాయ్ ఉన్నారు. అయితే స్పెషలిస్టు స్పిన్నర్ అయిన సాయికిశోర్‌ను టీమ్‌లోకి తీసుకోవాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో కిశోర్ సత్తాచాటాడు. 12 మ్యాచ్‌లాడి 20 వికెట్లతో దుమ్మురేపాడు. దీంతో అతడిని జట్టులోకి తీసుకోవాలని ప్రణాళికలు వేస్తున్నారు. ముంబై స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్‌పై సందేహాలు నెలకొని ఉన్నాయి. ఒకవేళ అతను అందుబాటులో లేకుంటే అతనిస్థానంలో ధాటిగా ఆడగలిగే బిగ్ హిట్టర్ జట్టుకు అవసరముంది. కీరన్ పొలార్డ్, సూర్యకుమార్ యాదవ్, క్రునాల్ వంటి హిట్టర్లు ఉన్నప్పటికీ వారికి తోడుగా సౌతాఫ్రికా ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ లాంటి ఆటగాడు ఉంటే బాగుంటుందని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. మరోవైపు ఈసారి వేలంలో హాట్‌కేకుగా ఉన్న క్లాసెన్‌ను ముంబై దక్కించుకోవాలని ప్లాన్స్ వేస్తోంది. గతంలో రాయల్ చాలెంజర్స్ తరపున రెండు సీజన్లలో అంతగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ తనదైన రోజున మ్యాచ్‌ను ఒంటిచేత్తో మలుపుతిప్పగల నేర్పరి క్లాసెన్. పొట్టిఫార్మాట్‌లో క్లాసెన్‌కు మంచి రికార్డు ఉంది. 76 మ్యాచ్‌ల్లో 1,368 రన్స్ చేశాడు. అతని స్ట్రైక్‌రేట్ 138.74 కావడం విశేషం. బేస్‌ప్రైస్ కూడా తక్కువే ఉండటంతో జట్టులోకి తనను తీసుకునే అవకాశాలే ఎక్కువ. ఇక పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా మిచెల్ మార్ష్‌ నిరూపించుకున్నాడు. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అందుబాటులో లేకపోతే అతనికి బదులుగా పేస్ ఆల్‌రౌండర్‌గా మార్ష్‌ను పరిగణించవచ్చు. ఈ ఏడాది వేలంలోకి అందుబాటులోకి వచ్చిన మార్ష్ చక్కని ఆప్షన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. 2016లోనే మార్ష్‌ను రైజింగ్ పుణే సూపర్‌జెయింట్ రూ.4.8 కోట్ల భారీరేటుకు కొనుక్కోవడం విశేషం. ఇక ఆస్ట్రేలియా టెస్టు జట్టులో చోటు కోసం గత రెండు సీజన్‌లుగా ఐపీఎల్‌కు దూరంగా ఉన్న మార్ష్..ఈసారి సత్తాచాటాలని భావిస్తున్నాడు.









Untitled Document
Advertisements