వెస్టిండీస్తో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్కి దూరమైన సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్.. ఆదివారం నుంచి ప్రారంభంకానున్న మూడు వన్డేల సిరీస్కి కూడా దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. టీ20 సిరీస్ ముంగిట నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షల్లో ధావన్ విఫలమవడంతో అతడి స్థానంలో సంజు శాంసన్ని టీ20 జట్టులోకి భారత సెలక్టర్లు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇటీవల దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో ఢిల్లీ తరఫున ఆడిన శిఖర్ ధావన్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. బంతిని అందుకునే క్రమంలో జారిపడిన ధావన్ మోకాలికి తీవ్ర గాయమవగా.. అప్పటి నుంచి ఈ ఓపెనర్ క్రికెట్కి దూరంగా ఉంటున్నాడు. మరోవైపు ధావన్ స్థానంలో రోహిత్ శర్మకి జోడీగా తొలి రెండు టీ20ల్లోనూ ఓపెనర్గా ఆడిన కేఎల్ రాహుల్ 62, 11 పరుగులు చేశాడు. ముఖ్యంగా.. తొలి టీ20లో అతను భారీ సిక్సర్లతో సెలక్టర్లని ఆకర్షించాడు. మూడు టీ20ల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమవగా.. విజేత నిర్ణయాత్మక ఆఖరి టీ20 మ్యాచ్ వాంఖడే వేదికగా బుధవారం రాత్రి 7 గంటలకి జరగనుంది. ఈ మ్యాచ్లోనూ కేఎల్ రాహుల్ ఓపెనర్గా ఆడే అవకాశం ఉంది. మరోవైపు ధావన్ స్థానంలో జట్టులోకి ఎంపికైన సంజు శాంసన్కి తుది జట్టులో మాత్రం అవకాశం దక్కడం లేదు. ఈ నేపథ్యంలో వన్డేలకి కూడా ధావన్ స్థానంలో శాంసన్నే ఎంపిక చేస్తారా..? లేక మరొకర్ని ఎంచుకుంటారా..? అనేది తేలాల్సి ఉంది. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ ముగిసిన తర్వాత శిఖర్ ధావన్ పేలవ ఫామ్తో నిరాశపరుస్తున్నాడు. సహచర ఓపెనర్ రోహిత్ శర్మ వన్డే, టీ20లతో పాటు టెస్టుల్లోనూ నిలకడగా రాణిస్తుండగా.. ఇప్పటికే టెస్టుల్లో మయాంక్ అగర్వాల్కి తన స్థానాన్ని ధావన్ కోల్పోయాడు. తాజాగా టీ20ల్లో కేఎల్ రాహుల్.. ఉప్పల్లో హాఫ్ సెంచరీ బాదడం ద్వారా ఓపెనింగ్ స్థానానికి తాను అర్హుడినని నిరూపించుకున్నాడు. ఇక ఆదివారం నుంచి ప్రారంభంకానున్న వన్డేల్లోనూ రాహుల్ ఒక సెంచరీ నమోదు చేసినా..? శిఖర్ ధావన్కి మళ్లీ జట్టులో స్థానం కోసం నిరీక్షణ తప్పదు..!