ఫోన్ కొనివ్వలేదని భర్త తలపగలగొట్టిన భార్య

     Written by : smtv Desk | Tue, Dec 10, 2019, 03:16 PM

ఫోన్ కొనివ్వలేదని భర్త తలపగలగొట్టిన భార్య

భర్త తనకు సెల్‌ఫోన్ కొనివ్వడం లేదన్న కోపంతో ఓ మహిళ అతడిపై హత్యాయత్నం చేసింది. ఇనుప రాడ్‌తో తలపై కొట్టడంతో అతడు ప్రాణాలతో కోసం పోరాడుతున్నాడు. తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడ దుమ్ములపేట తారకరామా నగర్‌కు చెందిన పర్ల నిత్యానందం, కుమారి ప్రియదర్శిని భార్యాభర్తలు. వీరికి ఏడాది వయసున్న బాబు ఉన్నాడు. కొంతకాలంగా తనకు సెల్‌ఫోన్ కొనివ్వాలంటూ ప్రియదర్శిని భర్తను అడుగుతోంది. అయితే తన దగ్గర అంత డబ్బులు లేదని, సంక్రాంతి పండుగకు కొంటానని అతడు చెప్పినా వినకుండా రోజూ గొడవ పడుతోంది. ఈ క్రమంలోనే సోమవారం ప్రియదర్శిని సెల్‌ఫోన్ కోసం భర్తతో మరోసారి గొడవ పడింది. బాబును కొట్టి ఏడిపించింది. నా మీద కోపంతో పిల్లాడిని ఎందుకు కొడతావంటూ నిత్యానందం బాబును ఎత్తుకునేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో కోపంతో ఉన్న ప్రియదర్శిని ఇనుప రాడ్ తీసుకుని భర్త తలపై గట్టిగా కొట్టింది. తీవ్ర రక్తస్రావంతో బాధితుడు కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని వెంటనే కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. కాకినాడ పోర్ట్ పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.






Untitled Document
Advertisements