శ్రీకృష్ణుడు చిటికిన వేలిపై ఎత్తిన గోవర్ధనగిరి ఎక్కడ ఉంది?

     Written by : smtv Desk | Tue, Dec 10, 2019, 03:19 PM

శ్రీకృష్ణుడు చిటికిన వేలిపై ఎత్తిన గోవర్ధనగిరి ఎక్కడ ఉంది?

శ్రీకృష్ణుడు లీలల గురించి చిన్నతనంలో ఎన్నో కధలు వినే ఉంటారు. ఉట్టి మీద వెన్నను దొంగిలించడం, మన్ను తినడం, గోపికలను ఆటపట్టించడం వంటి అల్లరి పనులతో పాటు ఆలమందలు, ప్రజల పట్ల అమితమైన ప్రేమను కనబరిచేవాడు. దుష్ట శిక్షణ కోసం, ప్రజల రక్షణ కోసం పాటు పడేవాడు. శ్రీకృష్ణుడి లీలలకు సంబంధించి ఎన్నో కధలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అయితే అవి కధలు కాదు మన కళ్లముందే ఉన్న నిజాలు అని నేటికీ కొన్ని ప్రదేశాలు రుజువు చేస్తుంటాయి. వాటిలో ప్రముఖమైనది గోవర్ధన గిరి. ఈ పేరు ఎక్కడో విన్నట్లు ఉంది కదూ. అవును, మీరు సరిగ్గానే ఆలోచించారు. శ్రీకృష్ణుడు ప్రజల రక్షణ కోసం చిటికిన వేలిపై ఎత్తిన గోవర్ధనగిరి ఇది. చిన్నప్పుడు గోవర్ధన గిరి వృత్తాంతం విన్నవారు కృష్ణుడి లీలల గురించి ఎంతో గొప్పగా ఊహించుకుంటారు. ఊహకే అది అంత గొప్పగా అనిపిస్తే.. నేరుగా వెళ్లి గోవర్ధన గిరిని చూస్తే ఇంకెలా ఉంటుంది చెప్పండి. ఇంతకీ ఈ గోవర్ధన గిరి కధేమిటి? ఎక్కడ ఉంది? ఎలా చేరుకోవాలి? అనే విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం... పూర్వం బృందావనంలో దేవతలకు అధిపతి అయిన ఇంద్రున్ని సంతృప్తి పరిచేందుకు ప్రతి ఏటా వైభవంగా ప్రజలు పూజలు నిర్వహించేవారు. అయితే ఓ సారి కృష్ణుడు ప్రజలతో మనం గోపాలులం... మనకు జీవనాధారమైన గోవులను పూజించాలి కానీ ఇంద్రుడికి పూజలెందుకు అని ప్రశ్నిస్తాడు. దీంతో ప్రజలు ఇంద్రునికి బదులు గోవులకు పూజలు చేయడం మొదలుపెడతారు. దీంతో కోపంతో రగిలిపోయిన ఇంద్రుడు ఆ ప్రాంతంలో కుండపోత వర్షాలను కురిపిస్తాడు. అప్పుడు కృష్ణుడు ఇక్కడి అతిపెద్ద గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలితో ఎత్తి ప్రజలను, గోవులను దాని కింద ఉంచి రక్షిస్తాడు. దాదాపు 7 రోజుల పాటు భీకర ప్రళయాన్ని సృష్టించిన ఇంద్రుడు చివరికి కృష్ణుడిని భగవంతుడిగా గుర్తించి తన ఓటమిని అంగీకరిస్తాడు. అలా గోపజనులను, గోవులను కాపాడిన శ్రీకృష్ణుడు గోవిందుడు, గిరిధారి అనే నామాలతో ప్రసిద్ధి చెందాడు. గోవర్ధనగిరి ఉన్న గ్రామాన్ని గోవర్ధన్ అనే పేరుతోనే పిలుస్తారు. గోవర్ధన పర్వతం వద్ద చిన్న గోవర్ధన మందిరం ఉంటుంది. ఇక్కడ ప్రజలు శ్రీకృష్ణున్ని దర్శించుకుని గోవర్ధన గిరి ప్రదక్షిణానికి బయలు దేరుతారు. ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం సాక్షాత్ శ్రీ కృష్ణుడి చుట్టూ ప్రదక్షిణ చేసినట్లుగా భక్తులు భావిస్తారు. ఈ పర్వతానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది నిలువుగా కాకుండా అడ్డంగా విస్తరించి ఉంటుంది. దీని చుట్టుకొలత దాదాపు 11 కిలోమీటర్లు. అంటే గిరి ప్రదక్షిణ చేసే వారు 11 కిలోమీటర్లు చుట్టిరావాలి. పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ ఈ గిరి ప్రదక్షిణ చేయడానికి ఎంతో ఉత్సాహం కనబరుస్తారు. చిన్న చిన్న ఆశ్రమాలను, సాధువుల కుటీరాలను, గ్రామాలను దాటుకుంటూ ఈ ప్రదక్షిణ సాగుతుంది. కొందరు భక్తులు కుటుంబంతో సహా గోవర్ధనగిరి చుట్టూ సాష్టాంగ ప్రదక్షిణ చేస్తారు. కొండపై ఉన్న భవనాలు, నిర్మాణాలు 16వ శతాబ్ధం నాటివని చెబుతారు. ఇక్కడ కొన్ని అవశేషాలకు పురావస్తు ఆధారాలు లేవు. ఎంతో ఘనమైన పురాణ ప్రాముఖ్యత గల గోవర్ధన గిరికి సమీపంలో అనేక పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. గోవర్ధనగిరితో పాటు ఈ ప్రదేశాలను సందర్శించేందుకు దేశ విదేశాల నుంచి టూరిస్టులు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు.

సందర్శనీయ స్థలాలు:

- కుసుమ్ సరోవర్ ఇసుకరాతి స్మారకం, సరస్సు
- గిరిరాజ్ ఆలయం
- శ్రీ చైతన్య ఆలయం (ఎర్రని ఇసుకరాతితో నిర్మించిన ఈ ఆలయం రాధా కృష్ణుల చిత్రాలతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది)
- రాధా కుండ్ ఆలయం
- మాన్సీ గంగా సరస్సు
- ధంగటి ఆలయం

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని మథుర జిల్లాలో బృందావన్ కు సమీపంలో గోవర్ధనగిరి ఉంది. బృందావన్ నుంచి గోవర్ధన గిరికి 22 కిలోమీటర్ల దూరం. గోవర్ధన గిరిని వజ్ర గిరి అని కూడా పిలుస్తారు. యమునా నది తీరాన ఉండే ఈ క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

ప్రముఖ పర్యాటక కేంద్రమైన మథురకు దగ్గరగా ఉన్న గోవర్ధన్ ఉత్తర్ ప్రదేశ్ లోని ఓ సుందరమైన పట్టణం. ఇక్కడికి అన్ని రవాణా మార్గాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు.

వాయు మార్గం:

గోవర్ధన్ లో విమానాశ్రయం లేదు. ఆగ్రా ఇక్కడికి సమీప విమానాశ్రయం. అయితే ఇక్కడి నుంచి ఇతర ప్రధాన నగరాలకు అనుసంధానం తక్కువగా ఉండడం వలన ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయాన్ని మంచి ఎంపికగా చెప్పవచ్చు. ఇక్కడికి దేశంలోని అన్ని నగరాలతో పాటు విదేశాలకు కూడా విమాన రాకపోకల సదుపాయం అధికంగా ఉంటుంది. విమానాశ్రయం నుంచి క్యాబ్ లేదా ట్యాక్సీల ద్వారా గోవర్ధన్ కు చేరుకోవచ్చు.

రైలు మార్గం:

గోవర్ధన్ కు సమీప రైల్వే స్టేషన్ మధుర. ఇది 22 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఉత్తర భారత దేశపు ప్రధాన నగరాలైన ఢిల్లీ, లక్నో, కాన్పూర్ ల నుంచి మథుర రైల్వే స్టేషన్ కు రైళ్లు తరచుగా నడుస్తుంటాయి. స్టేషన్ నుంచి క్యాబ్, ట్యాక్సీ, ఆటోల ద్వారా గోవర్ధన్ కు 30 నిమిషాల్లో చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం:

రోడ్డు మార్గం ద్వారా గోవర్ధన్ పట్టణం బాగా అనుసంధానించబడి ఉంది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు టూరిజం కార్పొరేషన్ వివిధ ప్రధాన నగరాల నుంచి మధుర వరకూ బస్సులు నడుపుతుంది. మథుర నుంచి స్థానిక బస్సులు, ట్యాక్సీల ద్వారా గోవర్ధన్ కు వెళ్లవచ్చు.







Untitled Document
Advertisements