కన్న కొడుకు విదేశాల్లో ఉద్యోగం చేస్తుంటే మురిసిపోయిన తల్లిదండ్రుల ఆనందం ఏంటో సేపు మిగల్లేదు. తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం కొమరగిరిపట్నంలో జరిగింది. గ్రామానికి చెందిన చింతలపూడి ధన్వంతరి ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేస్తూ భార్యతో కలిసి ఉంటున్నాడు. వారి కుమారుడు విజయ్కుమార్ సింగపూర్లోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇటీవల అతడికి పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన ఓ యువతితో నిశ్చితార్థం చేశారు. అయితే అంతకుముందే విజయ్కుమార్ తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం గ్రామానికి చెందిన ఓ ఉన్నత కుటుంబానికి చెందిన యువతితో ఫేస్బుక్లో ప్రేమాయణం నడిపాడు. తల్లిదండ్రులకు తన ప్రేమ విషయం చెప్పకుండా తణుకు యువతితో నిశ్చితార్థం చేసుకుని తర్వాత ఫేస్బుక్ ప్రియురాలితో వెళ్లిపోయాడు. ఓ వైపు కొడుకు చేసిన నిర్వాకంతో కుంగిపోయిన ధన్వంతరి, సుబ్బలక్ష్మి దంపతులకు పోలీస్ కేసులు తలనొప్పిగా మారాయి. నిశ్చితార్థం చేసుకుని మోసం చేశారని యువతి కుటుంబసభ్యులు తణుకులో పీఎస్లో ఫిర్యాదు చేయగా, విజయ్కుమార్ తమ కుమార్తెకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లిపోయాడని ద్రాక్షారామానికి చెందిన యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రెండు స్టేషన్ల పోలీసులు విజయ్కుమార్తో పాటు అతడి తల్లిదండ్రుల మీద కేసులు నమోదు చేశారు. పోలీసులు విచారణ పేరుతో తరుచూ స్టేషన్లకు పిలవడం, ఇద్దరు యువతుల కుటుంబాల నుంచి తీవ్రమైన ఒత్తిడి, బెదిరింపులు రావడంతో ధన్వంతరి, సుబ్బలక్ష్మి దంపతులు తట్టుకోలేకపోయారు. దీంతో మంగళవారం ఇంట్లోనే పురుగుల మందు తాగేశారు. ధన్వంతరి ఇంట్లోనే చనిపోగా.. ఆయన భార్య అమలాపురం కిమ్స్లో చికిత్స పొందుతోంది.