రేపు సుప్రీంలో ఎన్‌కౌంటర్‌పై విచారణ!

     Written by : smtv Desk | Tue, Dec 10, 2019, 06:50 PM

రేపు సుప్రీంలో ఎన్‌కౌంటర్‌పై విచారణ!

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ ఘటనపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టనుంది. సీపీ సజ్జనార్ స్వయంగా న్యాయస్థానంలో హాజరై ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. సుప్రీంలో విచారణ నేపథ్యంలో న్యాయవాదిని కలిసి వివరాలు సమర్పించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఎన్‌కౌంటర్‌పై సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం బుధవారం కమిషన్ ఛైర్మన్‌కు నివేదిక సమర్పించనుంది. షాద్‌నగర్‌లో దిశ అత్యాచారం, హత్య ఘటన నిందితుల ఎన్‌కౌంటర్‌పై సర్వోన్నత న్యాయస్థానంలో పిల్ దాఖలైన విషయం తెలిసిందే. దిశ హత్య కేసులో నిందితులను కాల్చి చంపి ఎన్‌కౌంటర్‌గా చెబుతున్నారని.. ఈ ఘటనపై విచారణ జరిపించాలని సుప్రీంకోర్టులో ఇద్దరు న్యాయవాదులు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలకు ఆదేశించాలని పిటిషనర్లు జీఎస్‌ మణి, ప్రదీప్‌ కుమార్‌ యాదవ్‌ కోరారు. ‘పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ (పీయూసీఎల్‌) వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మహారాష్ట్ర’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన 16 మార్గదర్శకాలను అమలు చేయాల్సిందిగా ఆదేశించాలని పిటిషనర్లు అభ్యర్థించారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ డీజీపీతో పాటు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌‌ను ప్రతివాదులుగా చేర్చారు. సీబీఐ లాంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థలతో, ఇతర రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారుల బృందంతో విచారణ జరిపించాలని కోరారు. షాద్‌నగర్ ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ఇప్పటికే విచారణ చేపట్టింది. దిశ కేసు నిందితుల మృతదేహాలను శుక్రవారం వరకు భద్రపరచాలని హైకోర్టు ధర్మాసనం సోమవారం (డిసెంబర్ 9) ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి నిందితుల మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఎన్‌కౌంటర్‌పై ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించిన సమగ్ర వివరాలను సమర్పించాలని ఏజీ (అడ్వొకెట్ జనరల్)ని హైకోర్టు ఆదేశించింది. ఈ ఘటనలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఒకవేళ పాటిస్తే దానికి ఆధారాలు చూపాలని అడ్వొకెట్ జనరల్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. బుధవారం సుప్రీంకోర్టులో విచారణను కూడా పరిశీలించి తదుపరి విచారణ చేపట్టనుంది. ఎన్‌కౌంటర్‌పై దాఖలైన పిటిషన్లన్నింటిపైనా అదే రోజు విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టం చేసింది.








Untitled Document
Advertisements