టీమిండియాలో లెగ్ స్పిన్నర్ యజ్వెంద్ర చాహల్ ఎన్నోసార్లు తనదైన చమత్కారలతో ఫ్యాన్స్ను అలరించాడు. ఆసక్తికరమైన, సిల్లీ జోక్స్, ప్రశ్నలతో తనదైన శైలిలో చాహల్ ఆకట్టుకునేలా చేస్తాడు. మరోవైపు అతనికి తోడుగా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ తోడయ్యి నవ్వులు పూయించిన వీడియోను బీసీసీఐ తాజాగా ట్విట్టర్లో షేర్ చేసింది. వీరిద్దరిని హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రాఫిడ్ ఫైర్ రౌండ్ ప్రశ్నలు అడుగుతూ ఈ వీడియోలో సందడి చేశారు. ఈ వీడియోలో భాగంగా టీమిండియాలో వరెస్ట్ డ్యాన్సర్ ఎవరూ అని కుల్చా జోడీని.. రోహిత్ అడుగగా ఏమాత్రం తడుముకోకుండా శివమ్ దూబే పేరును ఇరువురు చెప్పారు. ఇటీవల తిరువనంతపురంలో జరిగిన రెండో టీ20లో సత్తాచాటిన దూబే.. తన కెరీర్లో తొలి ఫిఫ్టీ నమోదు చేశాడు. అయితే ఆ మ్యాచ్లో వన్డౌన్లో పించ్ హిట్టర్గా దిగిన దూబే పరుగుల వరద పారించాడు. దీంతో భారత్ మెరుగైన స్కోరు సాధించింది. ఇక టీమిండియాలో వరెస్ట్ హెయిర్కట్ ఎవరికి ఉంటుందని కుల్చా జోడీని రోహిత్ అడుగగా వారిద్దరూ సరదా సమాధానాన్ని ఇచ్చారు. భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, పేసర్ మహ్మద్ షమీలను ఈ అవార్డుకు నామినేట్ చేసి నవ్వులు పూయించారు. మరోవైపు తొలిటీ20 సందర్భంగా హైదరాబాద్కు ఈ ప్లేయర్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నగరంలో నచ్చినవి ఏమిటని రోహిత్.. కుల్చా జోడీని ప్రశ్నించాడు. తనకేమో వెజ్ బిర్యానీ బాగా నచ్చుతుందని చాహల్ తెలిపాడు. అలాగే ఉప్పల్ స్టేడియంలో తన ఐపీఎల్ అరంగేట్రం జరిగింది, కాబట్టి తనకు స్టేడియంమంటే ఎంతో ఇష్టమని కుల్దీప్ తెలిపాడు. ఇక ఎవరికీ బౌలింగ్ చేయడం కష్టమని రోహిత్ వీరిద్దరిని ప్రశ్నించాడు. ఐపీఎల్లో మటుకు రోహిత్కే బౌలింగ్ చేయడానికి ఇబ్బంది పడుతానని చాహల్ పేర్కొన్నాడు. దీనికి ప్రతస్పందించిన రోహిత్.. ఈరోజు నైట్ డిన్నర్కు తీసుకెళ్తానని సరదాగా అన్నాడు. మరోవైపు ముంబై ఇండియన్స్ బ్యాట్స్మన్ సూర్యకుమార్ యాదవ్కు బౌలింగ్ చేయడం కష్టమని కుల్దీప్ తెలిపాడు. అవును.. తాను చాలా భీకరమైన బ్యాట్స్మన్ అని రోహిత్ అన్నాడు. ఇక అప్పటివరకు తమను ప్రశ్నించిన రోహిత్ను వీరిద్దరూ చివరగా ఓ ప్రశ్న అడిగి ఝలక్ ఇచ్చారు. గతంలో గడ్డంతో కన్పించిన రోహిత్.. ప్రస్తుతం క్లీన్షేవ్లో ఎందుకున్నావని కుల్చా ద్వయం అడిగింది. దానికి తన పాపకు గడ్డంతో ఉంటే నచ్చదని రోహిత్ సమాధానమిచ్చాడు. ఓవరాల్గా ర్యాపిడ్ ఫైర్ రౌండ్ మాదిరిగా జరిగిన ఈ వీడియో సోషల్ మీడియాలో అందిరినీ ఆకట్టుకుంటుంది. ఎప్పుడూ మైదానంలో గంభీరంగా కన్పించే క్రికెటర్లలో హస్యాన్ని చూపెట్టిందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.