మహిళలపై జరుగుతున్న అత్యాచారాల గురించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మంగళవారం ఒక కార్యక్రమంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ నేరాలు అత్యంత హేయమైనవని, వాటిని చూ స్తుంటే… అందరికీ సమాన హక్కులు అనే విశ్వజనీన దృక్పథం మన సమాజంలో ఉన్నదా? మనం ఆలాగే జీవిస్తున్నామా? అనే అనుమానం కలుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మానవ హక్కుల సందర్భంగా మంగళవారం విజ్ఞానభవన్లో జాతీయ మానవ హక్కు ల కమిషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. మానవ హక్కులకు సం బంధించి అంతర్జాతీయ పవిత్ర ప్రకటన (యుడిహెచ్ఆర్) ఆచరణకు అనువైన పరిస్థితులు ఉన్నాయా లేదా అని యావత్ ప్రపంచం ఆత్మశోధన చేసుకునేందుకు ఈ రోజు చాలా అనువైందని రాష్ట్రపతి పేర్కొన్నారు. 1948లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆమోదించి, ప్రకటించిన యుడిహెచ్ఆర్ పాటించేందుకు డిసెంబర్ 10న మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకొంటున్నారు. ‘ఇటీవల దేశం లో జరిగిన సంఘటనలు దిగ్భ్రాంతి కలిగించాయి. ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. బహిరంగ ప్రదేశాల్లో మహిళలకు భద్రత ఉండాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు జరిగాయి’ అని రామ్నాథ్ కోవింద్ అన్నారు. మైలురాయి వంటి యుడిహెచ్ఆర్ డాక్యుమెంట్ రూపకల్పనలో భారతీయ సంస్కర్త, విద్యావేత్త హంసరాజ్ మెహతా చేసిన కృషిని రాష్ట్రపతి ఈ సందర్భంగా గుర్తు చేశారు. యుడిహెచ్ఆర్ డాక్యుమెంట్ ఆర్టికల్ 1లో వాడిన భాషలో మెహతా గణనీయమైన మార్పు తీసుకొచ్చారు. ‘జన్మించిన పురుషులందరికీ స్వేచ్ఛ ఉంది. వారంతా సమానమే’ అనే వాక్యాన్ని … ‘జన్మించిన మనుషులందరికీ స్వేచ్ఛ ఉంది. వారంతా సమానమే’ అని హంస మెహతా మార్చారు. ‘మానవ హక్కుల కోసం, లింగ వివక్షలేని సమానత్వం కోసం పోరాటిన మెహతా వంటి వారి ఆశయ సాధనను ఈ రోజు నుంచి మనం ప్రారంభించాలి’ అని రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ విజ్ఞప్తి చేశారు.