చాణక్య నీతి....అధికారంలోకి రావాలంటే?!

     Written by : smtv Desk | Wed, Dec 11, 2019, 06:08 AM

వ్యూహాలకు మారుపేరైన చాణక్యుడు తనకు నందుల చేతిలో జరిగిన అవమానానికి ప్రతీకారంతో రగిలిపోయాడు. అలాంటి చాణక్యుడు ఓ పేద కుటుంబంలో పుట్టిన చంద్రగుప్తుని సానబట్టి తన ఆయుధంగా మలచుకుని నందులనే జయించాడు. అయితే, కౌటిల్యం అంటే కుటిల రాజకీయం అనే అర్ధం లోకంలో స్థిరపడిపోయింది.. కానీ కౌటిల్యుడు మహోన్నత మానవతా వాది. ఆయన రచించిన అర్ధశాస్త్రాన్ని చాణక్య నీతి శాస్త్రంగా పేర్కొంటారు. ఇందులో ఆర్ధిక అంశాలు, ఆదాయ వ్యయాలు, రాజనీతి, ప్రజా సంక్షేమం, పొరుగు దేశాలతో సత్సంబంధాలు, వ్యాపార వాణిజ్య విషయాలు, యుద్ధ తంత్రాల గురించి చర్చించాడు. రాజ్యాన్ని పాలించే వారు ఎలా ఉండాలో ఇందులో పేర్కొన్నారు. మను ధర్మ శాస్త్రాన్ని అనుసరించి శిక్షా స్మృతిని, రక్షణవ్యవస్థ పటిష్ఠం గురించి వివరించాడు. అర్ధ శాస్త్రం అంటే రాజకీయ యదార్థ శాస్త్రమని, ప్రభుత్వం ఎలా పని చేస్తుందో తెలియ జేస్తూ, ఎలా పని చేయాలో సూచించి, రాజు విధులను తెలియజేస్తుంది. ప్రజలకు పాలన దగ్గరకావాలని చెప్పిన ఆయన ప్రజలే రాజ్య నిర్మాతలని తెలిపారు. అయితే, వారుకూడా హద్దుదాటితే తీవ్రమైన శిక్ష ఎలా అమలు చేయాలో వెల్లడించారని పాశ్చాత్యలు మెచ్చుకున్నారు. ఆనాడు రాజు నిరంకుశుడే.. కానీ అలాంటి కాలంలో ఆర్ధిక పరిపుష్టి కల్గించడం ఎలాగో వివరించారు. న్యాయ సంబంధ విషయాలను వివరిస్తూ అధికారుల విధి విధానాలు సూచించారు. సంస్కృతిని ప్రతిబింబిస్తూనే పురోగతికి మార్గాలు సూచించారు. అధికారంలోకి రావాలంటే అణచివేతకు గురైన వర్గాలలో ఆశలు రేకెత్తించాలని, భయపడుతోన్నవారిని మరింత భయపెట్టాలని సూచించారు. అత్యాశతో ఉన్నవారికి లాభాలతో ఎరవేయాలని, అప్పటికే అధికారంలో ఉన్న నాయకులను పదవిలో నుంచి దించేయాలంటే ఆయన చుట్టూ ఉన్నవారిని కొనేయాలని తెలిపారు. చుట్టూ ఉన్నవారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని, వారి కదలికలు, నడతలో తేడాలను గమనించాలి.. బాధ్యతారాహిత్యులను, వ్యసనపరులను నమ్మకూడదు. పొగడ్తలు, తప్పుడు సలహాలతో దారి మళ్లించేవారిని దూరంపెట్టాలని, అనుభవమున్నవారిని ప్రోత్సహించాలని సూచించారు. ప్రత్యర్థి బలంగా ఉంటే అంతకంటే శక్తవంతమైనవారితో జతకట్టాలని, ఇద్దరూ సమ ఉజ్జీలైతే వారిలో వారికి విభేదాలు సృష్టించి బలహీనపడిన వాడిని గుప్పిట్లో ఉంచుకోవాలి.. బలవంతుడైనా ఓ పట్టాన లొంగని వారితో స్నేహం చేయాలని, అనితర సాధ్యమైన పనులు శక్తిమంతులతోనే సాధ్యమని స్పష్టం చేశారు. అలాగే మంత్రి మండలిలో మిత్రులను, గుట్టు తెలిసినవారిని చేర్చుకోరాదని సూచించారు. పాలకుడు ప్రజలను ఆకారణంగా దండిస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు. ప్రజాభీష్టం ప్రకారం పరిపాలించినప్పుడు ఆదరణ లభిస్తుందని తెలిపారు. విదేశీయులు పరిపాలిస్తే ధనం వారి దేశానికి తరలించుకుని పోతారు... కాబట్టి మంత్రులు, ఉన్నతాధికారులుగా విదేశీయులకు అవకాశం ఇవ్వరాదని అన్నారు.







Untitled Document
Advertisements