మూడో టీ20...భారత తుది జట్టులో రెండు మార్పులు..?

     Written by : smtv Desk | Wed, Dec 11, 2019, 07:01 AM

మూడో టీ20కి ముందు టీమిండియా కూర్పులో మార్పులు జరిగే అవకాశముంది. ముఖ్యంగా విండీస్ బ్యాట్స్‌మెన్లను నిలువరించలేకపోతున్న బౌలర్లలో ఇద్దరిపై వేటు పడే అవకాశముంది. స్పిన్నర్ సుందర్ స్థానంలో కుల్దీప్, పేసర్ భువనేశ్వర్ ప్లేస్‌లో షమీకి చోటు దక్కే అవకాశముందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న మూడు టీ20ల సిరీస్ ఆసక్తికరంగా సాగుతోంది. హైదరాబాద్‌లో జరిగిన తొలి టీ20లో ఆరు వికెట్లతో గెలుపొందిన ఇండియా సిరీస్‌లో ఫస్ట్ లీడ్ సాధించింది. అయితే తప్పక గెలవాల్సిన తిరువనంతపురం మ్యాచ్‌లో పుంజుకున్న విండీస్.. అన్ని విభాగాల్లో సత్తాచాటి విజయం సాధించింది. దీంతో సిరీస్‌ను 1-1తో సమం చేసింది. రెండో టీ20లో విజయం సాధించడంతో కరీబియన్ జట్టు ఫుల్లు ఆత్మవిశ్వాసంతో ఉంది. మరోవైపు పేలవ ఫీల్డింగ్, వాడిలేని బౌలింగ్‌తో ఇండియా ఒత్తిడిలో ఉంది. ఇక బుధవారం జరిగే మూడో టీ20లో విజయం సాధించే జట్టు సిరీస్ కైవసం చేసుకోనుండడం ఖాయం కావడంతో టీమిండియాలో మూడు మార్పులు చేసే అవకాశముంది. ముఖ్యంగా బౌలింగ్‌తోపాటు ఫీల్డింగ్‌లోనూ విఫలమవుతున్న యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌పై వేటు పడే అవకాశముంది. ఉప్పల్, తిరువనంతపురం రెండు టీ20ల్లోనూ వరుసగా క్యాచులు జారవిడవడం తనకు మైనస్‌గా మారింది. ఉప్పల్‌లో హిట్‌మయర్ క్యాచ్‌ను డ్రాప్ చేసినా పెద్దగా నష్టం జరుగలేదు. కానీ, రెండో టీ20లో ఆరంభంలోనే లెండిల్ సిమ్మన్స్ క్యాచ్‌ను జారవిడవడంతో ఇండియా భారీ మూల్యమే చెల్లించుకుంది. ఈ టీ20లో చివరివరకు అజేయంగా నిలిచిన సిమ్మన్స్.. భారీ అర్ధసెంచరీలో జట్టును విజయతీరాలకు చేర్చాడు. మరోవైపు బౌలింగ్‌లోనూ అంతంతమాత్రంగానే రాణిస్తున్నాడు. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే తొలి మ్యాచ్‌లో తనకు చాన్స్ రాలేదు. రెండో మ్యాచ్‌లో తొలి బంతికే డకౌటయ్యాడు. దీంతో సుందర్‌ను ఉద్వాసన ఖాయమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. సుందర్ స్థానంలో చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌ను జట్టులోకి తీసుకునే చాన్స్ ఉంది. విండీస్ పవర్‌హిట్లర్లను అడ్డుకోవాలంటే కుల్దీప్‌కు చోటిస్తేనే బెటరని విశ్లేషకులు పేర్కొంటున్నారు. క్వాలిటీ స్పిన్ బౌలింగ్‌ను ఆడలేని కరీబియన్లకు కుల్దీప్ త్రెట్‌గా మారే అవకాశముంది. మరోవైపు విండీస్ టీమ్‌లో ఎక్కువగా లెఫ్టాండర్లు ఉండడంతో వారిపై కుల్దీప్‌ ప్రభావం చూపగలుగుతాడని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక జట్టులోనుంచి భువనేశ్వర్ కుమార్ తప్పించే అవకాశం కూడా ఉంది. గాయం నుంచి కోలుకుని చాలాకాలం తర్వాత జట్టులోకి వచ్చిన భువీ.. ఆకట్టుకోలేకపోతున్నాడు. ఈ సిరీస్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా తీయకుండా 9కిపైగా సగటుతో పరుగులిచ్చాడు. ఈక్రమంలో తర్వాతి మ్యాచ్‌లో తనపై వేటు ఖాయమైనట్లేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. భువీ స్థానంలో ఫామ్‌లో ఉన్న మహ్మద్ షమీకి తుదిజట్టులో చోటు దక్కే అవకాశముంది. ఇటీవల జరిగిన మ్యాచ్‌ల్లో తను సత్తాచాటాడు. ఈక్రమంలో బుధవారం మ్యాచ్‌లో చాన్స్ దొరికితే పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని షమీ భావిస్తున్నాడు.















Untitled Document
Advertisements