రాజకీయ రణనీతి: ద్వాపరమైనా, కలియుగమైనా ఒకటే!

     Written by : smtv Desk | Wed, Dec 11, 2019, 07:19 AM

రాజకీయమంటే ఓ పద్మవ్యూహాం... అది ద్వాపరమైనా, కలియుగమైనా నాటి చక్రవర్తుల నుంచి నేటి ప్రధాన మంత్రులు దాకా అధికారమే పరమావధిగా వ్యూహ ప్రతివ్యూహాలతో సాగిపోతుంది. అధికారంలోని లేనివారు దాన్ని సాధించుకోవడం కోసం తాపత్రయపడితే, ఉన్నవారు దాన్ని ఎలా నిలుపుకోవాలని ఆలోచిస్తారు. నిలుపుకోవడమే కాదు దానిని తమ వారసులకు అప్పగించడంలోనూ రాజనీతిని ప్రదర్శిస్తారు. ఈ కోవకు చెందిందే మహాభారత సంగ్రామం. కురు పాండవుల మధ్య కురుక్షేత్ర యుద్ధం జరిగిందే రాజ్యాధికారం కోసం. హస్తినాపుర సింహాసనం చేజిక్కించుకోవడానికి కౌరవులు, పాండవులు తలపడ్డారు. ఇక, ధ్రుతరాష్ట్రుడి వల్ల చిత్ర హింసలకు గురై ప్రాణాలు వదిలిన సబులుడు కుమారుడు శకుని. తండ్రి చివరి కోరిక తీర్చడం కోసం కారాగారం ముగిసిన మరుక్షణమే శకుని తన పథకం అమలు చేయడం ప్రారంభించాడు. తన పన్నాగాలతో కౌరవులు, పాండవుల మధ్య దూరం పెంచడంలో సఫలీకృతుడయ్యాడు. తన తండ్రికి, అన్నదమ్ములకు దుర్గతి పట్టించిన ధ్రుతరాష్ట్రుడు, అతడి వారసులపై ప్రతీకారవాంఛతో రగిలిపోయి వారి వినాశనానికి అహర్నిశలు శ్రమించాడు. పైకి కౌరవులకు మద్దతిచ్చినట్లు కనిపించినా, లోలోపల తన పదునైన ఎత్తుగడలతో పూర్తిగా ధ్రుతరాష్ట్రుడి వంశాన్నే నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు. ఈ విధంగా మహాభారత యుద్ధానికి పరోక్షంగా శకుని బీజం వేశాడు. తాను కౌరవ పక్షంలోనే ఉంటూ వారిని పరోక్షంగా ఓడించారు. ఎదురుగా ఉన్న శత్రువును ఎదుర్కోవడం సులభమే కానీ, మన వెన్నంటి ఉన్న శత్రువుతో పోరాడటం కష్టమనేదానికి శకుని పాత్రే ఉదాహరణ. ఇక, కురుక్షేత్రం తలపిండి పాండవులే అయినా వెనుకుండి నడిపించింది మాత్రం శ్రీకృష్ణుడు. పాంచజన్యం పూరించకుండా, సుదర్శనం చక్రం ప్రయోగించకుండానే శత్రువులను మట్టికరిపించాడు. విజయం సాధించాలంటే పరివారమో, బలమో కాదు.. వ్యూహం ముఖ్యం. అందుకే తన సైన్యాన్ని కౌరవులకు అప్పగించి, అర్జునుడికి రథసారథిగా నిలిచాడు. శత్రువును జయించాలంటే అతడి బలహీనతలను తెలుసుకుని వాటిపై దెబ్బకొట్టాలని సూచించాడు. ఇక, రారాజు దుర్యోధనుడి బలహీనత ఊరవులు కాగా, గురువు ద్రోణాచార్యుడి బలహీనత అతడి కుమారుడు అశ్వత్థాముడు. అందుకే ధర్మరాజుతో చిన్న నిజం లాంటి అబద్దం పలికించి ద్రోణుడిని పడగొట్టాడు. శిఖండిని అడ్డంపెట్టుకుని భీష్ముడుని నిస్సహాయుడ్ని చేశాడు. శత్రువు ఓడించాలంటే అతడ్ని నలువైపుల నుంచి బలహీనపరచాలనేది కర్ణుడి విషయంలో సాగించిన వ్యూహమే ఉదాహరణ. కర్ణుడు రథసారథి శల్యుడిని తనవైపు తిప్పుకుని కృతకృత్యుడయ్యాడు. ప్రతి శత్రువుతోనూ పోరాటం చేయాల్సిన అవసరంలేదు.. చేయాల్సిందల్లా అతడికి శత్రువునే సృష్టించాలనే అంశాన్ని తూ.చ తప్పకుండా పాటించాడు. దీని వల్ల మన పనిని అతడే పూర్తిచేస్తాడని తెలిపాడు. ఇక మనవాళ్లు మనతోనే ఉంటే వేయి ఏనుగులు బలం.. అదే ప్రత్యర్థుల శిబిరంలో ఉంటే లక్ష అక్షౌహినుల సైన్యంతో సమానం.. మాయోపాయంతో శల్యుడ్ని దుర్యోధనుడు తనవైపు తిప్పుకుంటే దీనిని తమకు అవకాశం మలచుకున్నారు పాండవులు. కురుక్షేత్ర సంగ్రామంలో 17వ రోజున కర్ణుని రథాన్ని తోలే బాధ్యతను శల్యునికి అప్పగిస్తాడు దుర్యోధనుడు. అదే అదను కోసం ఎదురుచూస్తున్న శల్యుడు అడుగడుగునా అతడిని సూటిపోటి మాటలతో దెప్పిపొడుస్తూ, పాండవును వేనోళ్ల పొగుడుతూ కర్ణుడి అత్మవిశ్వాసం దెబ్బతీశాడు. కర్ణుడికి రథసారథిగా ఉన్న శల్యుడు ఆయన ఏకాగ్రతను దెబ్బతీసేలా ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలివివైన నాయకుడి లక్షణం. ఇదే విషయాన్ని అశ్వత్థాముడు నారాయణాస్త్రాన్ని ప్రయోగించగానే సైన్యాన్ని ఆయుధాలు కిందపడేసి శరణువేడుకోమని సూచించాడు. నేటి రాజకీయాల్లోనూ ప్రస్తుతం ఇలాంటి సంఘటనలు కొకొల్లలుగా చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల సమయంలో విజయం కోసం రాజకీయ నేతలు ఇలాంటి ఎత్తుగడలనే అనుసరించి ప్రత్యర్థులను చిత్తుచేస్తుంటారు.








Untitled Document
Advertisements