అవార్డును అభిమానికి అంకితమిచ్చిన చరణ్

     Written by : smtv Desk | Wed, Dec 11, 2019, 07:58 AM

అభిమానులు అంటూ లేకపోతే హీరోలు లేరు. అందుకే, అభిమానులకు హీరోలు అంత ప్రాధాన్యత ఇస్తారు. వాళ్లు ఏ పని చేసినా అభిమానులకు నచ్చాలని అనుకుంటారు. తమను ఎంతగానో ప్రేమించే అభిమానులకు ఏమైనా అయితే ఆ హీరోలు తల్లడిల్లిపోతారు. ప్రస్తుతం మెగా హీరోల పరిస్థితి ఇలానే ఉంది. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి వరుణ్ తేజ్ వరకు అందరు మెగా హీరోలకు వీరాభిమానిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి నూర్ భాయ్. గ్రేటర్ హైదరాబాద్ మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఉన్న ఆయన మెగా ఫ్యామిలీకి ఆప్తుడు. నూర్ భాయ్ అనారోగ్యంతో సోమవారం కన్నుమూశారు. విషయం తెలుసుకున్న మెగా హీరోలంతా నూర్ భాయ్ ఇంటికి వెళ్లి ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. తమ ఆప్తుడిని కోల్పోయామని చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ అందరూ అన్నారు. అయితే, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక మెట్టు పైకెక్కి తనకు వచ్చిన అవార్డును దివంగత అభిమాని నూర్ భాయ్‌కి అంకితమిచ్చారు. తమిళనాడుకు చెందిన ఎంటర్‌టైన్మెంట్ ఛానెల్ ‘బిహైండ్ వుడ్స్’ ఏటా సినిమా వాళ్లకు అవార్డులు అందజేస్తోంది. ఈ ఏడాది రామ్ చరణ్‌కు కూడా ఒక అవార్డును ప్రకటించింది. ‘‘ది పీపుల్స్ ఎంటర్‌టైనర్ పార్ ఎక్స్‌లెన్స్ - తెలుగు’’ కేటగిరీలో రామ్ చరణ్‌కు గోల్డ్ మెడల్ ప్రకటించారు. నిన్న చెన్నైలో జరిగిన ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రామ్ చరణ్.. మెడల్‌ను తన అభిమాని నూర్ భాయ్‌కి అంకితమిస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






Untitled Document
Advertisements