కురుక్షేత్రంలో అర్జునుడి రథంపై హనుమాన్...ఎందుకో తెలుసా?

     Written by : smtv Desk | Wed, Dec 11, 2019, 08:19 AM

ఆంజనేయుడు లేకపోతే రామాయణానికి అర్థం లేదు. రామాయణంలో హనుమంతుడి పాత్ర గురించి అందరికీ బాగా తెలుసు. కానీ మహాభారతంలోనూ మారుతి పాత్ర గురించి కొందరికే తెలుసు. భారతంలో కూడా రెండుసార్లు కనిపిస్తాడని పురాణాలు పేర్కొన్నాయి. హనుమంతుడు చిరంజీవి కాబట్టే మహాభారతంలోనూ కనిపించాడు. ఆయనను భీముడికి సోదరుడిగా పేర్కొంటారు.. ఎందుకంటే ఇద్దరూ వాయుదేవుని వరం వల్ల జన్మించారు కాబట్టి. మహాభారతంలో తొలిసారిగా పాండవులు వనవాసం కాలంలో భీముడిని కలుస్తాడు. రెండోసారి కురుక్షేత్రంలో అర్జునుడి రథంపై జెండాలో ఉండి రక్షణగా ఉంటాడు.
పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ద్రౌపది సౌగంధిక పుష్పాలు కావాలంటూ భీముడిని కోరుతుంది. వీటిని తీసుకురావడానికి భీమసేనుడు వెళుతున్న మార్గంలో ముసలి కోతి విశ్రాంతి తీసుకుంటూ అడ్డంగా ఉంటుంది. ముందుకు వెళ్లడానికి భీముడు కోతిని అడ్డుతప్పుకోమని కోరతాడు. అయితే తానూ చాలా ముసలివాడిని, తోకను కూడా కదపే శక్తి కూడా లేనందు వల్ల నీవే అడ్డు తొలగించుకుని వెళ్లు అంటూ భీముడిని ప్రాధేయపడతాడు.

భీముడు అహంకారంతో తోకను పక్కకు నెట్టడానికి ప్రయత్నించాడు. కానీ ఒక్క అంగుళం కూడా కదిలించకపోయాడు. భీముడు చాలాసేపు ప్రయత్నించిన తర్వాత ఈ కోతి సాధారణమైంది కాదని గ్రహించి శరణు వేడుకోవడమే కాకుండా క్షమాపణలు కూడా అడిగాడు. దీంతో హనుమంతుడు తన నిజస్వరూపం దాల్చి భీముడిని ఆశీర్వదించాడు.

ఆంజనేయుడిని రామేశ్వరం వద్ద ఒక సాధారణ కోతి రూపంలో అర్జునుడిని కలుసుకున్నాడు. లంకను చేరుకోడానికి రాముడు నిర్మించిన వారధిని చూసిన అర్జునుడు దీని నిర్మాణానికి కోతుల సహాయం ఎందుకు తీసుకున్నాడని దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. నేను ఒక్కడ్నే ఈ వంతెనను బాణాలతో నిర్మించేవాడిని అనుకున్నాడు.

నీ బాణంతో నిర్మించిన వంతెన సంతృప్తికరంగా ఉండేది కాదు, అది ఒక వ్యక్తి బరువును కూడా మోసి ఉండేది కాదని హనుమంతుడు వెటకారంగా అన్నాడు. అర్జునుడు దీన్ని సవాలుగా తీసుకుని తాను నిర్మించిన వంతెన సంతృప్తికరంగా లేదంటే అప్పుడు అగ్నిలో దూకుతానన్నాడు. అర్జునుడు బాణాలతో నిర్మించిన వంతెనపై ఆంజనేయుడు కాలు మోపగానే అది కుప్ప కూలిపోయింది. దీంతో అర్జునుడు తన జీవితాన్ని అంతం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

అప్పుడు కృష్ణుడు ప్రత్యక్షమైన ఆ వంతెనను తన దివ్య స్పర్శతో పునర్నిర్మించాడు. ఆ తర్వాత దానిపై పాదం మోపమని హనుమంతుడిని కోరాడు. ఈసారి వంతెన చెక్కుచెదరలేదు. తన నిజరూపంలోకి వచ్చిన హనుమంతుడు కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి సహాయం చేస్తానని వాగ్దానం చేశాడు.

అందుకే కురుక్షేత్రం యుద్ధం సంభవించినప్పుడు హనుమంతుడు అర్జునుని రథ జెండాపై యుద్ధ ప్రారంభం నుంచి ముగిసే వరకు ఉన్నాడు. కురుక్షేత్ర యుద్ధం చివరి రోజున, కృష్ణుడు యుద్ధం అంతం వరకు హనుమంతుడు అక్కడ ఉన్నందుకు ధన్యవాదాలు తెలిపాడు. అప్పుడు హనుమంతుడు వంగి నమస్కరించడమే కాకుండా రథం వదిలి వెళ్ళాడు. హనుమంతుడు వెళ్ళిన వెంటనే రథం అగ్నికి ఆహుతి అయ్యింది. ఇదంతా వీక్షించిన అర్జునుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు కృష్ణుడు ఇప్పటివరకు హనుమంతుడు రక్షించడం వల్ల ఈ దివ్యమైన ఆయుధాలు ఏమీ చేయలేకపోయాయి. లేనట్లయితే ఎప్పుడో రథం అగ్నికి ఆహుతి అయి ఉండేదన్నాడు. కాబట్టి హనుమంతుడు రామాయణంలో మాత్రమే కాదు కానీ మహాభారతంలో కూడా ఒక కీలకమైన పాత్ర పోషించాడు.





Untitled Document
Advertisements