దిశ నిందితుల్లో ముగ్గురూ మైనర్లే

     Written by : smtv Desk | Wed, Dec 11, 2019, 11:11 AM

దిశ నిందితుల్లో ముగ్గురూ మైనర్లే

దిశ హత్య కేసులో ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన నలుగురు నిందితుల్లో మరో నిందితుడు మైనర్ అని తేలింది. ఇదివరకే ఇద్దరు మైనర్లని వారి తల్లిదండ్రులు ఆధారాలు చూపించిన సంగతి తెలిసిందే. అయితే, మూడో వ్యక్తి జొల్లు నవీన్ కుమార్ కూడా మైనరే అనడం చర్చనీయాంశమైంది. ఈ మంగళవారం అతని తల్లి బోనాఫైడ్‌ సర్టిఫికెట్‌ చూపించారు. నిందితులు శివ, చెన్నకేశవులు మైనర్లని సోమవారం వారి తల్లిదండ్రులు పాఠశాలలో ఇచ్చిన బోనాఫైడ్‌ సర్టిఫికెట్లు చూపించారు. నిందితుల కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ మంగళవారం నమోదు చేసింది. ఈ బోనాఫైడ్‌ సర్టిఫికెట్లు నిందితుల్లో ముగ్గురిని మైనర్లుగా చూపించడంతో ఎన్‌కౌంటర్ కేసు ఏ మలుపు తిరుగుతుందోననే ఆసక్తి నెలకొంది. ఈ పత్రాల ప్రకారం ప్రధాన నిందితుడు మహ్మద్‌ ఆరిఫ్‌ మినహా మిగిలిన ముగ్గురూ మైనర్లే అవుతున్నట్లు తెలుస్తోంది. అందరిలో కెల్లా జొల్లు నవీన్‌ అత్యంత చిన్న వయస్కుడని అతని బోనాఫైడ్ పత్రాన్ని బట్టి తెలుస్తోంది. ఇతను 2004 ఏప్రిల్‌ 4న జన్మించినట్లు ఆ బోనాఫైడ్‌లో ఉంది. ఈ లెక్కన ఎన్‌కౌంటర్‌ నాటికి నవీన్‌ వయసు 14 ఏళ్ల 10 నెలలు అవుతుంది. మరోవైపు జొల్లు నవీన్ ఆధార్‌కార్డు ప్రకారం అతని వయసు 18 ఏళ్లుగా ఉండడం గమనార్హం. బోనాఫైడ్ పత్రాల ప్రకారం.. నిందితులు జొల్లు శివ, చింతకుంట చెన్నకేశవుల వయసు 18 ఏళ్లలోపే ఉంది. వీరిద్దరూ నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం గుడిగండ్ల ప్రభుత్వ పాఠశాలలో చదివారు. వీరిలో చెన్నకేశవులు పుట్టిన తేదీ 10-4-2004గా పేర్కొన్నారు. మరొక నిందితుడు జొల్లు శివ బోనఫైడ్‌ సర్టిఫికెట్‌లో 2002 ఆగస్టు 15న జన్మించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఎన్‌కౌంటర్‌ ఘటన జరిగిన రోజు నాటికి జొల్లు శివ వయసు 17 ఏళ్ల 3 నెలల 21 రోజులు కాగా, చెన్నకేశవులు వయసు 15 ఏళ్ల 7 నెలల 26 రోజులుగా ఉంది. జొల్లు శివ సర్టిఫికెట్‌ను అతని తల్లిదండ్రులు ఈ వారంలోనే తీసుకున్నారు. మరోవైపు చెన్నకేశవులకు ఇప్పటికే వివాహం కాగా, అతడి భార్య ప్రస్తుతం గర్భవతి. దిశను సజీవ దహనం చేసిన ప్రదేశాన్ని మంగళవారం అమెరికాకు చెందిన పలువురు జర్నలిస్టులు పరిశీలించారు. అమెరికా కేంద్రంగా పని చేసే న్యూయార్క్ టైమ్స్‌ పత్రికకు చెందిన భారత ప్రతినిధి, ఫోటోగ్రాఫర్‌లు మంగళవారం ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని సందర్శించారు. దిశను కాల్చిన ప్రాంతంతోపాటు, అక్కడ గుమిగూడిన జనం, ఎన్‌కౌంటర్ జరిగిన స్థలాన్ని ఫోటోలు తీశారు.







Untitled Document
Advertisements