పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్ సభలో ఆమోదముద్ర పడిన సంగతి తెలిసిందే. ఈరోజు మధ్యామ్నం 12 గంటలకు రాజ్యసభలో ఈ బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు, లోక్ సభలో ఈ బిల్లుకు శివసేన మద్దతు పలికింది. అయితే, రాజ్యసభలో మద్దతు ఇవ్వచ్చు లేదా ఇవ్వకోవచ్చని ఆ పార్టీ సంచలన వ్యాఖ్యలు చేసింది.
పార్లమెంటు ప్రాంగణంలో శివసేన కీలక నేత, ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ, 'ఈ బిల్లుపై మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. అవి క్లియర్ కావాల్సి ఉంది. మా ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు రాని పక్షంలో... లోక్ సభలో మేము వ్యవహరించిన తీరుకు భిన్నంగా వ్యవహరిస్తాం' అని తెలిపారు. మరోవైపు, శివసేన మద్దతు ఇవ్వకపోయినా ఇతర పార్టీల అండతో బిల్లును గట్టెంకించుకునే సంఖ్యాబలం బీజేపీకి ఉండటం గమనార్హం.