మూడో టీ20...ఇరుజట్లకు అరుదైన రికార్డులు

     Written by : smtv Desk | Wed, Dec 11, 2019, 12:14 PM

మూడో టీ20...ఇరుజట్లకు అరుదైన రికార్డులు

విండీస్ తో జరుగుతున్న టీ20 సిరీస్ లో భాగంగా నేడు మూడో టీ20 జరగనుంది. హైదరాబాద్‌లో జరిగిన తొలి టీ20ని భారత్ నెగ్గగా.. తిరువనంతపురంలో జరిగిన రెండో మ్యాచ్‌ను విండీస్ నెగ్గి లెక్కసరిచేసింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విండీస్ బ్యాట్స్‌మెన్ భారీగా పరుగులు సాధించారు. ఏకంగా 27 సిక్సర్లను మంచినీళ్ల ప్రాయంగా బాదారు. ఇక ముంబై వేదికగా బుధవారం జరిగే మూడో టీ20పై అందరి దృష్టి నెలకొని ఉంది. ఈ మ్యాచ్‌లో ఒకవేళ ఇండియా తొలుత బ్యాటింగ్ చేస్తే భారీస్కోరు సాధిస్తేనే కోహ్లీసేనకు అవకాశాలుంటాయి. ఈ మ్యాచ్‌కు ముందు టీ20ల్లో ఇండియా, వెస్టిండీస్ జట్లు నమోదు చేసిన విశేషాలు.

1/5: ఈ ఏడాది సొంతగడ్డపై జరిగిన ఆరు టీ20ల్లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఇందులో కేవలం ఒక్కదానిలో మాత్రం ఇండియా నెగ్గి, మిగతా ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. గతనెలలో బంగ్లాదేశ్‌తో నాగ్‌పూర్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో దీపక్ చాహర్ (6/7) అద్భుత రికార్డు నమోదు చేసిన టీ20లో నెగ్గింది.

75.28: టీ20ల్లో ముంబైవాంఖడే స్టేడియంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ సగటు. ఇక్కడ 12 టీ20లాడిన విరాట్ 151.87 స్ట్రైక్‌రేట్‌తో 527 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు ఫిఫ్టీలున్నాయి.

994: భారత గడ్డపై కోహ్లీ నమోదు చేసిన పరుగులు. మరో ఆరు పరుగులు సాధిస్తే వెయ్యి రన్స్ మైలురాయిని చేరుకుంటాడు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారత ప్లేయర్‌గా నిలుస్తాడు. ఒకదేశంలో వెయ్యి లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్లలో నాలుగో స్థానంలో నిలుస్తాడు.

399: టీ20ల్లో రోహిత్ శర్మ నమోదు చేసిన సిక్సర్ల సంఖ్య. మరో సిక్సర్ సాధిస్తే 400 సిక్సర్ల క్లబ్‌లో తను చేరతాడు. ఈక్లబ్‌లో క్రిస్ గేల్, షాహిద్ ఆఫ్రిది ఉన్నారు. అయితే గత 5 మ్యాచ్‌ల్లో రోహిత్ కేవలం ఒకే ఒక్క సిక్సర్ మాత్రమే బాదాడు.

52-1: టీమిండియా తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచేందుకు స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్‌ మరో వికెట్ దూరంలో నిలిచాడు. 36 మ్యాచ్‌ల్లో 52 వికెట్లు తీసిన అతను.. రవిచంద్రన్ అశ్విన్‌తో కలిసి సంయుక్తంగా టాప్ ప్లేస్‌లో ఉన్నాడు.

7-1: తిరువనంతపురం విక్టరీతో రెండేళ్ల తర్వాత భారత్‌పై విండీస్ సాధించిన తొలి విజయం ఇదే కావడం విశేషం. అంతకుముందు జరిగిన ఏడు మ్యాచ్‌ల్లోనూ భారతే నెగ్గింది.

1000: తమ కెరీర్‌లో వెయ్యి పరుగుల మార్కును చేరుకునేందుకు కీరన్ పొలార్డ్, లెండిల్ సిమ్మన్స్ అతి సమీపంలో ఉన్నారు. ఈ మైలురాయిని చేరడానికి పొలార్డ్‌కు 10 రన్స్, సిమ్మన్స్‌కు 17 రన్స్ అవసరం కానున్నాయి. ముంబైలో వీరిద్దరూ ఈ మార్కును చేరే చాన్స్ ఉంది.












Untitled Document
Advertisements