సెన్సార్ పూర్తి కాకుండానే రిలీజ్ హడావుడి...అసలు విడుదలవుతుందా?

     Written by : smtv Desk | Wed, Dec 11, 2019, 03:40 PM

సెన్సార్ పూర్తి కాకుండానే రిలీజ్ హడావుడి...అసలు విడుదలవుతుందా?

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’. ఈనెల 12న సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. సినిమా సెన్సార్ కూడా అయిపోయిందని అన్నారు. సినిమా విడుదల తేదీ పోస్టర్లతో రెండు రోజులుగా ట్విట్టర్‌లో తెగ హడావుడి చేస్తున్నారు.నిజానికి ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సెన్సార్ ఇంకా పూర్తికాలేదని విశ్వసనీయ సమాచారం. హైదరాబాద్‌లోని ప్రాంతీయ సెన్సార్ బోర్డు తాము ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వలేమని తేల్చి చెప్పేసింది. దీంతో రివైజింగ్ కమిటీకి వెళ్లారు. సినిమా చూసిన కమిటీ టైటిల్‌ మార్చాలని, కొన్ని సన్నివేశాలను తొలగించాలని సూచించింది. ఈ మేరకు మార్పులు చేశారు. మళ్లీ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు సంతృప్తి చెందారని తెలిసింది.సినిమా చూసిన రివైజింగ్ కమిటీ సభ్యులు ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ ఇస్తున్నట్టు నిర్మాతకు చెప్పారట. సెన్సార్ ఆఫసర్‌కు తమ నుంచి క్లియరెన్స్ ఇచ్చేశారట. అయితే, సెన్సార్ ఆఫీసర్ సర్టిఫికెట్‌పై ఇంకా సంతకం పెట్టలేదని విశ్వసనీయంగా తెలిసింది. రేపు సినిమా విడుదల ఉన్నప్పటికీ ఇప్పటికీ ఇంకా సర్టిఫికెట్ నిర్మాత చేతికి చేరలేదు. ఈ సర్టిఫికెట్ కోసం కవాడిగూడలోని సెన్సార్ ఆఫీస్ చుట్టూ నిర్మాత తిరుగుతున్నారని సమాచారం.‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సినిమా నవంబర్ 29న విడుదల కావాల్సి ఉంది. అయితే, ఈ సినిమాపై హైకోర్టులో ఫిర్యాదు నమోదుకావడం.. సెన్సార్ కూడా పూర్తికాకపోవడంతో విడుదల ఆగిపోయింది. సెన్సార్ బోర్డు సినిమా చూసి వారం రోజుల్లో తమ అభిప్రాయం తెలపాలని హైకోర్టు అప్పుడు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సినిమా చూసిన సెన్సార్ బోర్డు ఇప్పటి వరకు సర్టిఫికెట్ ఇవ్వలేదు. బుధవారం హైకోర్టులో ఈ సినిమాపై వేసిన పిటిషన్‌పై విచారణ కూడా జరగనుంది. ఈ నేపథ్యంలో రేపు (డిసెంబర్ 12న) ఈ సినిమా విడుదల అవుతుందంటే అనుమానే.2019 ఎన్నికల్లో పోటీ చేసిన ప్రముఖ రాజకీయ నాయకుల పాత్రలను తీసుకొని పొలిటికల్ సెటైర్ మూవీగా ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాను వర్మ తెరకెక్కించారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, కేఏ పాల్ పాత్రలను కించపరిచే విధంగా సినిమాలో చూపించారు. దీంతో వర్మపై కేఏ పాల్ కోర్టుకెక్కారు. ఈ సినిమా విడుదలను ఆపాలని కోరారు. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చారని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో మరోసారి కేఏ పాల్ మీడియా ముందుకు వచ్చారు.













Untitled Document
Advertisements