ఉత్తరప్రదేశ్ హమీర్పూర్ జిల్లాలో ఓ దారుణ సంఘటన కనిపించింది. ఓ హ్యాండ్ పంపు నుంచి నీరుకు బదులు రక్తం, మాంసం ముద్దలు బయట పడ్డాయి. ఈ ఘటన పూర్తి వివరాల ప్రకారం .. ఖాజోడీ గ్రామం ఎప్పటి నుంచో నీటి ఎద్దడి ఎదుర్కొంటోంది. దీంతో అధికారులు ఇటీవల హ్యాండ్ పంపు వేశారు. కొన్నాళ్లు అందులో నుంచి నీరు బాగానే వచ్చింది. ప్రజలు తమకు ఇక నీటి కష్టాలు తీరాయని సంతోషించారు. అయితే, గత కొద్ది రోజులుగా ఆ హ్యాండ్ పంపు నుంచి నీరుకు బదులు రక్తం వస్తోంది. అప్పుడప్పుడు మాంసం, ఎముకలు బయటపడుతున్నాయి. నీరు కూడా దుర్వాసన వస్తోంది. దీంతో ప్రజలు ఆ పంపు దగ్గరకు వెళ్లాలంటేనే హడలిపోతున్నారు. ఈ సమస్యను హమీర్పూర్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై విచారణ జరపాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. హ్యాండ్ పంపును తెరచి చూసిన సిబ్బంది.. లోపల రక్తం ఆనవాళ్లేవీ లేవని తెలిపారు. పాము హ్యాండ్ పంప్ లోపలకి వెళ్లి చనిపోయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, దీనికి స్పష్టమైన కారణం ఏమిటనేది చెప్పలేకపోతున్నారు. ఈ సమస్య వల్ల ఖాజోడీ ప్రజలు నీటి కోసం మళ్లీ అవస్థలు ఎదుర్కొంటున్నారు.