ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కేంద్రం నుంచి రూ.2400 కోట్ల గ్యారంటీ కోరింది. నిర్వహణ అవసరాలను నెరవేర్చేందుకు గాను తాజాగా నిధుల సేకరణ కోసం ఎయిర్ ఇండియా ప్రయత్నం చేస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి. నవంబర్ నెల వేతనాల చెల్లింపులు ఆలస్యమయ్యాయని, గురువారం చెల్లించే అవకాశముందని సంస్థ అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాను విక్రయించే పనులను వేగవంతం చేసింది. నిర్వహణా అవసరాల కోసం నిధులను సేకరించే క్రమంలో రూ.2400 కోట్ల గ్యారెంటీని విమాన సంస్థ కోరిందని అధికారులు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విమాన సంస్థకు ఏర్పాటు చేస్తామని రూ.7600 కోట్ల గ్యారెంటీలో భాగంగా రూ.2400 కోట్లను కోరిందని అన్నారు. నవంబర్ 27న రాజ్యసభలో కేంద్రమంత్రి హర్దీప్సింగ్ పూరి మాట్లాడుతూ, ఎయిర్ ఇండియా ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడతామని, ఎవరూ ఉపాధిని కోల్పోరని భరోసా ఇచ్చారు. సంస్థలో 4వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల న్యాయం కోసం కట్టుబడి ఉన్నామని, విమానయాన సంస్థను ఎవరు కొనుగోలు చేసినా శిక్షణ పొందిన సిబ్బంది కూడా అవసరమవుతారని అన్నారు. పెట్టుబడులు పెట్టడం సాధ్యం కాకపోతే, దాన్ని మూసివేయవలసి వస్తుందన్నా. ఎయిర్ ఇండియా ఉద్యోగులందరి ప్రయోజనాలను చూసుకుంటామని మంత్రి అన్నారు. ఉద్యోగులు అందరికి తగిన డీల్ కుదిరేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. వేతనాలను చెల్లించడం లేదని పలువురు ఎయిర్ ఇండియా పైలట్లు సంస్థను వదిలివెళ్లారనే వార్తలను ఆయన ఖండించారు. ఉద్యోగులు సంస్థతోనే ఉన్నారని, ఎవరూ రాజీనామా చేసినట్టు తాను వినలేదని మంత్రి తెలిపారు.