టీ20ల్లో నెం.1...కోహ్లీ, రోహిత్ శర్మ @2633

     Written by : smtv Desk | Thu, Dec 12, 2019, 12:19 PM

టీ20ల్లో నెం.1...కోహ్లీ, రోహిత్ శర్మ @2633

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ గత కొన్ని సిరీస్‌లుగా నెం.1 స్థానం కోసం పడుతున్న సంగతి తెలిసిందే. వన్డే ప్రపంచకప్ తర్వాత సూపర్ ఫామ్‌లో కొనసాగుతున్న ఈ ఇద్దరు స్టార్ బ్యాట్స్‌మెన్‌లు.. టీ20ల్లో ఆశ్చర్యకరరీతిలో నెం.1 స్థానంతోనే ఈ ఏడాదిని ముగించబోతున్నారు. వెస్టిండీస్‌తో వాంఖడే వేదికగా బుధవారం రాత్రి ముగిసిన ఆఖరి టీ20 మ్యాచ్‌లో రోహిత్ శర్మ 34 బంతుల్లోనే 6x4, 5x6 సాయంతో 71 పరుగులు చేయగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ కేవలం 29 బంతుల్లోనే 4x4, 7x6 సాయంతో 70 పరుగులు చేశాడు. దీంతో.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 2,633 పరుగులతో సంయుక్తంగా నెం.1 స్థానంలో నిలిచారు. 2010, డిసెంబరులో భారత టీ20 జట్టులోకి అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లీ కెరీర్‌లో ఇప్పటి వరకూ 75 టీ20 మ్యాచ్‌లాడి 52.66 సగటుతో 2,633 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 247 ఫోర్లు, 71 సిక్సర్లు ఉండగా.. స్ట్రైక్‌రేట్ 138.07గా ఉండటం విశేషం. ఇక 2007, సెప్టెంబరులో టీ20ల్లోకి ఎంట్రీకి ఇచ్చిన రోహిత్ శర్మ 104 మ్యాచ్‌లాడి 32.11 సగటుతో 2,633 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ల్లో 234 ఫోర్లు, 120 సిక్సర్లు ఉండగా.. స్ట్రైక్‌రేట్ సరిగ్గా కోహ్లీలానే 138.22గా ఉండటం విశేషం. అంతర్జాతీయ టీ20ల్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ 2,436 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతుండగా.. అతని తర్వాత పాకిస్థాన్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ షోయబ్ మాలిక్ (2,263), న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ మెక్‌కలమ్ (2,140) టాప్-5లో ఉన్నారు. ఈ ఏడాది భారత్ జట్టు ఇక టీ20 మ్యాచ్‌లు ఆడే అవకాశం లేకపోవడంతో.. కోహ్లీ, రోహిత్ శర్మ టాప్ స్కోరర్‌గానే 2019ని ముగించబోతున్నారు.





Untitled Document
Advertisements