భారతీయ సంతతికి చెందిన ఒక డాక్టర్ను బ్రిటన్ కోర్టు నేరస్తుడిగా నిర్ధారించింది. క్యాన్సర్ భయాన్ని అవకాశంగా మలచుకుని వైద్య పరీక్షల పేరిట మహిళలపై శరీరాలతో ఆడుకున్న జనరల్ ప్రాక్టీషనర్గా వైద్య వృత్తిని నిర్వహిస్తున్న 50 ఏళ్ల మనీష్ షా ఆరుగురు మహిళలపై లైంగిక దాడికి పాల్పడ్డాడని లండన్లోని ఓల్డ్ బైలీ కోర్టు నిర్ధారించింది. తన వద్దకు వచ్చే మహిళలకు క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన భయాలను రేకెత్తించి పరీక్షల నెపంతో వారి మర్మాయవాలను తాకి మనీష్ షా లైంగికానందం పొందేవాడని కోర్టు ధృవీకరించింది. ఇందుకోసం ఆ డాక్టర్ రొమ్ము క్యాన్సర్ రాకుండా హాలీవుడ్ నటి ఆంజెలీనా జోలీ తీసుకునే జాగ్రత్తలను గురించి ఆ మహిళలకు కథలుగా చెప్పి వారి రొమ్ములను తాకే వాడని కూడా కోర్టు తేల్చింది. తూర్పు లండన్లోని మావ్నీ మెడికట్ సెంటర్లో జనరల్ ప్రాక్టీషనర్గా పనిచేస్తున్న మనీష్ షా 2009-2013 మధ్య కాలంలో తన వద్దకు వచ్చిన ఆరుగురు మహిళలకు అవసరం లేనప్పటికీ రొమ్ము పరీక్షలు, మర్మాంగాల పరీక్షలు నిర్వహించాడని కోర్టు పేర్కొంది. వీరిలో ఒక 11 ఏళ్ల బాలిక కూడా ఉందని కోర్టు తెలిపింది. గతంలో ఈ రకమైన ఆరోపణలతోనే మరో 17 మంది మహిళలపై లైంగిక దాడులకు పాల్పడిన మనీష్ షాకు శిక్ష విధించిన విషయాన్ని గుర్తు చేసిన కోర్టు తాజా కేసులో శిక్షకు సంబంధించి తన తీర్పును వచ్చే ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా వేసింది. ఈ ఆరోపణలు వచ్చిన దరిమిలా మనీష్ షా వైద్య ప్రాక్టీసును సస్పెండ్ చేసిన ప్రభుత్వం పోలీసు దర్యాప్తునకు ఆదేశించింది.