ఉరి భయం: తిండి తిప్పలు మానేసిన నిర్భయ దోషులు!

     Written by : smtv Desk | Thu, Dec 12, 2019, 04:59 PM

ఉరి భయం: తిండి తిప్పలు మానేసిన నిర్భయ దోషులు!

నిర్భయ హత్యాచార దోషుల క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి వద్ద ఉన్న సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై రాష్ట్రపతి ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికీ.. వీరి క్షమాభిక్ష రద్దయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. వీరిని ఉరితీయడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. దీంతో నిర్భయ దోషుల్లో ప్రాణభయం కనిపిస్తోంది. తమ చావు కళ్ల ముందు కదలాడుతున్న వేళ.. నిర్భయ దోషులకు నిద్ర కరువైంది. వారు అన్నపానీయాలను ముట్టడం లేదని సమాచారం. దోషులు అక్షయ్, ముకేశ్, వినయ్, పవన్‌.. అర్ధరాత్రి వరకు తమ తమ జైలు గదుల్లోనే నిద్ర మానేసి అటూ ఇటూ తిరుగుతూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జైలు అధికారులు ఇచ్చిన ఆహారాన్ని వారు సరిగా తినడం లేదు. వీరి ఉరిశిక్ష అమలు గురించి అధికారికంగా ఎలాంటి ఆదేశాలు అందలేదు. కానీ తిహార్ జైల్లో ఇప్పటికే ఉరి తీయడానికి అవసరమైన పనులు జరిగిపోతున్నాయి. నిర్భయ దోషులను డిసెంబర్ 16న లేదా డిసెంబర్ 29న (నిర్భయ చనిపోయిన రోజు) ఉరి తీస్తారని ప్రచారం జరుగుతోంది. నిర్భయ దోషులను ఉరితీయడానికి బక్సార్ జైలు నుంచి ఉరి తాళ్లను తీసుకొస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై తిహార్ జైలు అధికారి మాట్లాడుతూ.. తమ దగ్గర ఇప్పటికే ఐదు తాళ్లు ఉన్నాయన్నారు. కానీ తాము బక్సార్ అధికార యంత్రాగాన్ని సంప్రదిస్తున్నామని తెలిపారు. 11 ప్రత్యేక ఉరితాళ్లను తెప్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. త్వరలో తాము ఆర్డర్ ఇస్తామన్నారు. నలుగురు నిర్భయ దోషులను ఉరి తీస్తే.. తీహార్ జైల్లో ఇక ఒక తాడు మాత్రమే ఉంటుంది. వీరిని ఉరి తీయడానికి ముందు ఒకట్రెండు తాళ్లతో ట్రయల్స్ వేసే అవకాశం ఉంది. ఉరి తాళ్లను పుణేలోని యెరవాడ జైల్లోనూ తయారు చేస్తారు. ఉరి తాళ్ల కోసం తిహార్ జైలు అధికారులు యెరవాడ జైలును కూడా సంప్రదించే అవకాశం ఉంది.








Untitled Document
Advertisements