ఉత్తర గర్భంలోనే చనిపోయిన పరీక్షితుడు ఎలా బ్రతికాడో తెలుసా?

     Written by : smtv Desk | Thu, Dec 12, 2019, 06:19 PM

ఉత్తర గర్భంలోనే చనిపోయిన పరీక్షితుడు ఎలా బ్రతికాడో తెలుసా?

కురుక్షేత్ర సంగ్రామంలో అశ్వత్థాముడు ప్రయోగించిన బ్రహ్మ శిరోనామకాస్త్రం అభిమన్యుడి భార్య ఉత్తర గర్భంలో పెరుగుతున్న శిశువుపై ప్రభావం చూపింది. ఈ అస్త్రం గర్భంలోని శిశువు వధించబోగా శ్రీ కృష్ణుని ఉత్తర శరణువేడింది. దీంతో కృష్ణుడు తన సుదర్శన చక్రం అడ్డు వేసి తల్లీబిడ్డలను రక్షించాడు. దీంతో ఉత్తర గర్భంలోని శిశువు సురక్షితంగా ఎదిగి, ఉజ్వల తేజస్సుతో జన్మించాడు. ఈ బిడ్డకు ‘విష్ణురాతుడు’ అని నామకరణం చేశారు. గర్భంలో తనకు కనిపించిన దైవం లోకమంతా ఉన్నాడా అని పరీక్షించినందువల్ల ఈయనకు పరీక్షిత్తుడని పేరు స్థిరపడింది. విష్ణురాతుడు తన అసలు పేరుతో కంటే పరీక్షిత్తు పేరుతోనే ప్రసిద్ధి చెందాడు. ఎంతో చురుకైన పరీక్షిత్తు క్షత్రియ విద్యలను అభ్యసించి, యుక్త వయసులో ఉత్తర కుమారుడి కుమార్తె ఐరావతిని వివాహం చేసుకున్నాడు. ఒకసారి పరీక్షిత్తు వేటకు మృగాన్ని వేటాడుతూ శమీక మహర్షి ఆశ్రమానికి చేరాడు. అక్కడ తపస్సులో ఉన్న మునిని చూసి తన నుంచి తప్పించుకు వచ్చిన మృగమెక్కడని అడిగాడు. తపస్సులో లీనమైన శమీక ముని సమాధానం ఇవ్వకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆయనకు సమీపంలో చచ్చి పడి ఉన్న పామును ముని మెడలో వేసి వెళ్లిపోయాడు. కొద్దిసేపటికి అక్కడకు వచ్చిన ముని కుమారుడు, తన తండ్రి మెడలో చచ్చిన పామును చూసి కోపోద్రక్తుడయ్యాడు. ఈ పని చేసిన వాడు ఏడు రోజులలో సర్పం వల్ల మరణిస్తాడని శపించాడు. అయితే, కుమారుడి తొందరపాటు తనం గురించి తెలుసుకున్న శమీక ముని అతడిని మందలించాడు. రాజు తెలియక చేసిన చిన్న తప్పునకు అంత పెద్ద శిక్ష సరికాదన్నారు. అనంతరం పరీక్షిత్తు వద్దకు వెళ్లి, తన కుమారుడి శాపం గురించి వివరించగా, పరీక్షిత్తు మహారాజు పశ్చాత్తాపంతో బాధపడ్డాడు. తన కుమారుడు జనమేజయునికి రాజ్యపాలన అప్పగించి ప్రాయోపవేశం చేయాలని పరీక్షిత్తు నిశ్చయించుకున్నాడు. పరీక్షిత్తుకు తనకు వచ్చిన ఆపద గురించి పలువురు మహర్షులను కలిసి.. మునీశ్వరులారా నేను ఆవేశంలో పెద్ద తప్పే చేశాను. ఇక నేను క్షమకు నోచుకోనా? నాకు సద్గతులు ఉంటాయా? నాకు జ్ఞానబోధ చేయండి. ఒక వారంలో నేను పరమార్ధాన్ని పొందే మార్గాన్ని సూచించండి. నాకు మోక్షాన్ని ప్రసాదించండని వేడుకున్నాడు. పరీక్షిత్తు మహారాజు స్థితికి జాలిపడ్డారు. దీనికి వ్యాసుడి కుమారుడు శుక మహర్షిని సమర్ధుడిగా తలచారు. అరిషడ్వర్గాలను జయించే మార్గం, భక్తి, ముక్తిని శుక మహర్షి బోధించాడు. ఆ క్రమంలో పరీక్షిత్తు అడిగిన అనేక సందేహాలను ఆయన తీర్చాడు. సర్పం వల్ల తనకు మరణం సంభవిస్తుందనే భయంతో పరీక్షిత్తు గంగా తీరంలో దుర్భేద్యమైన ఒంటి స్తంభం మేడ కట్టించుకుని అందులో ఉన్నారు. భాగవతం సప్తాహం రోజున మానవరూపం దాల్చిన పాములు పరీక్షిత్తుకు పండ్లు ఇచ్చాయి. ఒక పండులో దాగివున్న తక్షకుడు అనే సర్పం బయటకు వచ్చి కాటు వేయడంతో పరీక్షిత్తు మరణించాడు. మహర్షులు బోధించిన జ్ఞానామృతం, భాగవత శ్రవణంతో పరీక్షిత్తు మహారాజుకు మోక్షం ప్రాప్తించింది.







Untitled Document
Advertisements