సంక్రాంతి బరిలోకి దిగిన అల్లు అర్జున్ తాజా చిత్రం 'అల వైకుంఠపురంలో' సూపర్ హిట్ అయింది. తొలిరోజు ఈ చిత్రం ఏకంగా రూ. 85 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు సినిమా యూనిట్ సభ్యులు తెలిపారు. సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో, అల్లు అర్జున్ కు ఆయన మామయ్య, జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. అల్లు అర్జున్ కు ఓ ఫ్లవర్ బొకేతో పాటు ఓ సందేశాన్ని కూడా పవన్ పంపారు. తానే స్వయంగా ఈ లేఖ రాశారు. లేఖలో బన్నీని 'గౌరవనీయ అల్లు అర్జున్ గారు' అని సంబోధించడం గమనార్హం. ''అల వైకుంఠపురంలో' చిత్రం గ్రాండ్ సక్సెస్ అయిన సందర్భంగా శుభాకాంక్షలు. రానున్న రోజుల్లో మరిన్ని ఘన విజయాలు సాధించాలను ఆకాంక్షిస్తున్నా' అని లేఖలో పవన్ పేర్కొన్నారు. దీన్ని అల్లు అర్జున్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
పవన్ అభినందనలపై అల్లు అర్జున్ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారి నుంచి అభినందనలు రావడం చాలా సంతోషంగా ఉందని.. థ్యాంక్యూ పవన్ కల్యాన్ గారు అంటూ బన్నీ ట్వీట్ చేశాడు.