అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన తేదీలను ఖరారు చేసే పనిలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని కుదిరితే ఫిబ్రవరి రెండు లేదా మూడో వారంలో ట్రంప్ భారత్లో పర్యటించే అవకాశం ఉంది. అయితే ట్రంప్పై అక్కడి సెనేట్లో అభిశంసన ప్రక్రియ కొనసాగుతున్నది. దీనిపై జరిగే చర్చ.. తదనంతర పరిణామాల ఆధారంగానే ఆయన పర్యటన తేదీ ఖరారు చేసే అవకాశం ఉంది. అయితే ఈ అంశంపై శ్వేతసౌధం మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. గత సంవత్సర గణతంత్ర వేడుకలకు ట్రంప్ని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ముందే ఖరారైన కార్యక్రమాల కారణంగా రాలేకపోతున్నామని అప్పట్లో తెలిపారు. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జైశంకర్ గత నెల శ్వేతసౌధంలో ట్రంప్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారత పర్యటనకు అధ్యక్షుడిని ఆహ్వానించారు. దానికి ట్రంప్ సానుకూలంగా స్పందించారు.