గత మూడు రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధర సోమవారం మరింత తగ్గింది. సోమవారం ఒక్కరోజే 236 రూపాయలు తగ్గడంతో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 40,432కు తగ్గింది. అటు పసిడి బాటలోనే వెండి పయనించి కిలో ధర రూ. 48,000 మార్క్ దిగువకు చేరింది. సోమవారం 376 రూపాయలు తగ్గడంతో కిలో వెండి 47,635 రూపాయలు పలికింది. అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణగడం, రూపాయి బలపడటం వల్ల బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నట్లు మార్కెట్ నిపుణులు వెల్లడించారు. అటు.. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బంగారంపై దిగుమతి సుంకం ఎక్కువగా విధిస్తుండటం వల్ల పసిడికి గిరాకీ తగ్గిందని వర్తకులు తెలిపారు.