అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన కామెంట్స్పై జోక్ చేసి భారత అమెరికన్ ప్రొఫెసర్ ఇబ్బందుల్లో పడ్డారు. సరదాగా కౌంటర్ వేద్దామని ఫేస్బుక్లో పెట్టిన పోస్టు వల్ల ఉద్యోగం పోయింది. తమ సంస్థ క్రమశిక్షణా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారంటూ బోస్టన్లోని ప్రముఖ ఎకనమిక్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ బాబ్సన్ కాలేజీలో సస్టైనబులిటీ డిపార్ట్మెంట్ హెడ్గా ఉన్న ఇండియన్ అమెరికన్ ప్రొఫెసర్ ఆషీన్ ఫనసేని విధుల నుంచి తొలగించింది. ఇరాన్ టాప్ కమాండర్ జనరల్ ఖాసిం సులేమానీని అమెరికా హత్య చేసిన తర్వాత ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రికత్త వాతావరణ ఏర్పడింది. సులేమానీ హత్యకు అమెరికా మూల్యం చెల్లించుకోవాల్సిందేనని, అధ్యక్షుడు ట్రంప్కు బుద్ధి చెబుతామని ఇరాన్ హెచ్చరించింది. దీంతో ‘ఇరాన్ ప్రతీకార దాడికి దిగితే.. మేం చూస్తూ ఊరుకోం. ఆ దేశంపై యుద్ధానికి రెడీ. ఇరాన్ సంస్కృతికి చిహ్నాల్లాంటి 52 ప్రదేశాల లిస్టు సిద్ధంగా ఉంది. గతంలో ఎన్నడూ జరగని రీతిలో అత్యంత వేగంగా, తీవ్రమైన అటాక్ చేస్తాం. ఆ దేశం సంస్కృతిని సైతం నాశనం చేస్తాం’ అని ట్రంప్ ట్వీట్ చేశారు. అయితే ఈ కామెంట్ను అమెరికా ఆర్మీ తోసిపుచ్చింది. సంస్కృతి చిహ్నాలపై దాడి చేయడం యుద్ధ నేరం కిందికి వస్తుందని అలాంటి పనులు తాము చేయబోమని పెంటగాన్ ప్రకటించింది. ట్రంప్ ట్వీట్పై సరదాగా తన పర్సనల్ ఫేస్బుక్ పేజీలో ఇండియన్ అమెరికన్ ప్రొఫెసర్ ఫనసే కౌంటర్ వేశారు. ఇరాన్లో 52 చోట్ల బాంబులేస్తామని అమెరికా ప్రకటించినట్లే.. ఆ దేశమూ చేయాలన్నారు. అమెరికాలోని 52 ఫేమస్ ప్లేసుల లిస్టును ఇరాన్ ప్రకటించాలని పోస్ట్ చేశారు. కొన్ని ప్లేస్ల పేర్లు కూడా ఆయన ప్రస్తావించారు. అమెరికాలో ఉంటూ ఇక్కడ దాడి చేయమంటారా అంటూ ఆ పోస్ట్ వైరల్ అయిపోయింది. తన పోస్టును తప్పుగా అర్థం చేసుకున్నారని, తాను హింసను ప్రోత్సాహించడం లేదని.. సరదాగా పెట్టిన పోస్ట్ అని వివరణ ఇచ్చారు ఫనసే. దీన్ని ఆయన డిలీట్ చేసి క్షమాపణ కూడా చెప్పారు. కానీ అప్పటికే చాలా మంది దాన్ని స్క్రీన్ షాట్స్ తీసి వైరల్ చేయడంతో ఆయన పని చేస్తున్న బాబ్సన్ కాలేజ్ యాజమాన్యం యాక్షన్ తీసుకుంది. హింసను ప్రేరేపిస్తూ భయాందోళనను సృష్టించే కామెంట్స్ను ఖండిస్తున్నామని, క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆయన్ని సస్పెండ్ చేస్తున్నామని ప్రకటించింది.