మహానటి కీర్తి సురేశ్ బాలీవుడ్ ప్రేక్షకుల్ని కూడా పలకరించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. అజయ్ దేవగణ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘మైదాన్’లో ఆమె కథానాయికగా నటించనున్నట్లు వెల్లడించారు. బోనీ కపూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 1952 నేపథ్యంలో ఫుట్బాల్ ఆటగాడు సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా తీస్తున్న సినిమా ఇది. కాగా, ఈ ప్రాజెక్టు నుంచి కీర్తి సురేశ్ తప్పుకొన్నట్లు సమాచారం. ఈ మేరకు ఆమె, బోనీ పరస్పరం ఒప్పందానికి వచ్చారట. సినిమాలోని పాత్రకు కీర్తి సురేశ్ సరిపోవడం లేదని తెలిసింది. అజయ్ భార్య పాత్రకు తగినట్లు లేరని, చాలా తక్కువ వయసు అమ్మాయిలా కనిపిస్తున్నారని చెబుతున్నారు. బాలీవుడ్ ఎంట్రీకి ఇది సరైన సినిమా కాదని కీర్తి అభిప్రాయపడ్డారట. ఈ నేపథ్యంలో ఆమె చిత్రం నుంచి తప్పుకొన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.