హోబర్ట్ టెన్నిస్ టైటిల్స్‌ను సొంతం చేసుకున్న సానియా

     Written by : smtv Desk | Sat, Jan 18, 2020, 07:16 PM

హోబర్ట్ టెన్నిస్ టైటిల్స్‌ను సొంతం చేసుకున్న సానియా

రెండేళ్ల తర్వాత అంతర్జాతీయ టెన్నిస్ కోర్టులోకి అడుగుపెట్టిన భారత ప్లేయర్ సానియా మీర్జా అదిరే ఆరంభాన్ని దక్కించుకుంది. ఉక్రెయిన్ భాగస్వామి నాదియా కిచెనోక్‌తో కలిసి హోబర్ట్ ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నీలో బరిలోకి దిగిన సానియా జంట విజేతగా నిలిచింది. 2017లో చివరిసారి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడిన ఈ హైదరాబాదీ స్టార్.. తన కొడుకుకు జన్మనిచ్చాక మళ్లీ హోబర్ట్ టోర్నీతోనే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడం విశేషం. శనివారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో అన్‌సీడెడ్ సానియా జంట 6-4, 6-4తో వరుస సెట్లలో రెండోసీడ్ చైనాకు చెందిన షువాయ్ పెంగ్-షువాయ్ జాంగ్‌పై వరుస సెట్లలో విజయం సాధించింది. గంటా 21 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసి సానియా జంట విజయం సాధించింది. ఈక్రమంలో మూడు ఏస్‌లు సంధించింది. సానియా కెరీర్లో ఇది 42వ డబ్ల్యూటీఏ టైటిల్ కావడం విశేషం. 2017లో బ్రిస్బేన్ టోర్నీ నెగ్గాక మళ్లీ ఆస్ట్రేలియా గడ్డపైనే సానియా టైటిల్‌ను సాధించింది. తాజా విజయంతో ఈనెలలో ప్రారంభమయ్యే గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌‌లో సానియా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగే అవకాశముంది. సానియాకు డబుల్స్‌లో మంచి రికార్డు ఉంది. ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను నెగ్గడంతోపాటు ఒకనొకదశలో వరల్డ్ నం.1 ర్యాంకును సాధించింది.






Untitled Document
Advertisements