బీజేపీ పేరు వింటే బామ్మర్దులు భయపడుతున్నారు!

     Written by : smtv Desk | Sat, Jan 18, 2020, 08:18 PM

బీజేపీ పేరు వింటే  బామ్మర్దులు భయపడుతున్నారు!

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఎంఐఎం పార్టీ నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పేరు వింటే ఇవాళ యావత్ భారతదేశమే కాదు, ప్రపంచమే భయపడుతోందని అన్నారు. తన బామ్మర్దులు కూడా తెగ భయపడుతున్నారంటూ ఘాటు విమర్శలు చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్‌ పట్టణంలో శనివారం (జనవరి 18) రోడో షోలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా అధికార టీఆర్‌ఎస్‌తో పాటు మజ్లిస్ పార్టీపై విమర్శల వర్షం కురిపించారు. ‘బీజేపీ పేరు వింటే ప్రపంచమే భయపడుతోంది. నా బామ్మర్ది కూడా చాలా భయపడుతున్నాడు. వందేమాతరం గానీ, జనగణమన గానీ ఎప్పుడూ చెప్పలే ఆయన.. భారతదేశ జెండా పట్టుకోలేదు. కానీ, ఇవాళ మోదీ, అమిత్ షా భయం చూడండి. దారుస్సలాంలో ప్రతి ఒక్కరి చేతిలో జాతీయ జెండా కనపడుతోంది’ అంటూ రాజా సింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘మేం కూడా భారతీయులం, మేం కూడా ఇక్కడే పుట్టాం అంటున్నారు వాళ్లు.. ఇప్పుడు యాదొస్తుందా? ఇంతకుముందు యాది రాలేదా? ఇప్పుడు మోదీ, అమిత్ షా దెబ్బతో అందరూ భయపడుతున్నారు’ అని రాజా సింగ్ తనదైన శైలిలో చెప్పారు. భారతమాత అంటే మన బామ్మర్దుల చెవి వరకు పోవాలె అంటూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. నిజామాబాద్ పట్టణంలో 39 మున్సిపల్ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు రాజాసింగ్ పిలుపునిచ్చారు. బీజేపీ అభ్యర్థి మేయర్ అయితే నిజామాబాద్‌ పేరును ఇందూరుగా మారుస్తామని ప్రకటించారు. టీఆర్ఎస్, ఎంఐఎంలకు ధన బలముంటే బీజేపీకి కార్యకర్తల బలముందని అన్నారు. అధికార పార్టీ బెదిరింపులకు పాల్పడితే బెదిరిపోవడానికి తాము కాంగ్రెస్ కార్యకర్తలం కాదని.. బీజేపీ కార్యకర్తలమని వ్యాఖ్యానించారు. స్వాతంత్య్రం రాకముందు నిజామాబాద్ పేరు ఇందూరుగా ఉండేదని రాజాసింగ్ గుర్తు చేశారు. నిజాం పాలకులు ఇందూరు పేరును నిజామాబాద్‌గా మార్చారని తెలిపారు. భర్తల్ని హతమార్చి భార్యల్ని వివస్త్రల్ని చేసి నగ్నంగా బతుకమ్మ ఆడించిన దుర్మార్గమైన చరిత్ర నిజాం పాలకులదని ఆయన మండిపడ్డారు. బీజేపీ నిజామాబాద్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటే.. నిజాం పాలనకు వ్యతిరేకంగా పట్టణం పేరును ఇందూరుగా మారుస్తామని బీజేపీ ఎమ్మెల్యే వివరించారు.






Untitled Document
Advertisements