టాలీవుడ్ మొత్తం ఎంతోగానో.. ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా, ఎస్.ఎస్.రాజమౌళి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాను జులై 30న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర విడుదల తేదీ మారనుందని టాలీవుడ్ వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ విడుదల తేదీ మారిందంటూ సామాజిక మాధ్యమాల్లో వార్త హల్చల్ చేస్తోంది. దీనికితోడు ప్రముఖ సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ చేసిన ట్వీట్ కూడా ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది.
‘విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. దక్షిణాదికి చెందిన బ్లాక్బస్టర్ డైరెక్టర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు విడుదల తేదీ మారనుంది. ఈ భారీ చిత్రం అక్టోబరు 2020లో వచ్చే అవకాశం ఉంది అని తరుణ్ ఆదర్శ్ ట్విట్ చేశారు.’
ఈ ట్వీట్ ఒక్కసారిగా ట్రెండింగ్లోకి వచ్చింది. అది ‘ఆర్ఆర్ఆర్’ చిత్రమే అంటూ చర్చ మొదలైంది. అంతేకాదు, ‘కేజీఎఫ్ చాప్టర్2’ అని కూడా అంటున్నారు. అయితే, ఎక్కువమంది మాత్రం ‘ఆర్ఆర్ఆర్’ విడుదల తేదీ వాయిదా పడినట్లు చెబుతున్నారు. ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే చిత్ర బృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. జక్కన్న చిత్రాల విడుదల తేదీ వాయిదా పడటం సాధారణమే. గతంలో ఇలా జరిగిన సందర్భాలెన్నో. సినిమా క్వాలిటీగా తీసే విషయంలో అస్సలు రాజీ పడరు రాజమౌళి. అందుకే షూటింగ్, నిర్మాణానంతర కార్యక్రమాలు ఆలస్యమవుతూ ఉంటాయి. అందులోనూ ఎన్టీఆర్, రామ్చరణ్ వంటి స్టార్లతో సినిమా అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి చిత్ర బృందం దీనిపై ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.
మరోవైపు ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కీలకమైన పోరాట ఘట్టాల్ని ఈ నెల 20 నుంచి తెరకెక్కించనున్నారు. వాటిలో ఎన్టీఆర్తోపాటు రామ్చరణ్ కూడా పాల్గొంటున్నారు. ఈ షెడ్యూల్లోనే రామ్చరణ్ – ఆలియాభట్లపై కూడా కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కిస్తారని సమాచారం. రూ.350 కోట్ల పైచిలుకు వ్యయంతో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్గా నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆలియాభట్, ఒలివియా మోరిస్ హీరోయిన్గా నటిస్తున్నారు. డి.వి.వి.దానయ్య ఈ చిత్రాని నిర్మిస్తున్నారు.