జనవరి, ఫిబ్రవరి నెలల్లో జిఎస్టి రూ.1.15 లక్షల కోట్లు, మార్చి నెలలో రూ.1.25 లక్షల కోట్లు వసూలు చేయాలని అధికారులు లక్షంగా పెట్టుకున్నారు. ఈ మేరకు రెవిన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే నేతృత్వంలో శుక్రవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇంతకు ముందు నెలకు రూ.. 1.1 లక్షల కోట్ల జిఎస్టి వసూళ్లను లక్షంగా పెట్టుకున్న అధికారులు .. తాజాగా దీన్ని రూ.1.15 లక్షల కోట్లకు పెంచారు. అంతేకాకుండా జిఎస్టి రిటర్న్లలో మోసాలు గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. డిసెంబర్ నెలలో వస్తు సేవల పన్ను వసూళ్లు మళ్లీ లక్ష కోట్లను దాటిన విషయం తెలిసిందే. గత నెలలో రూ. 1.03 లక్షల కోట్ల మేర జిఎస్టి వపూలైనట్లు అధికారులు తెలిపారు.గత ఏడాది అక్టోబర్ నెలలో జిఎస్టి వసూళ్లు లక్ష కోట్ల మార్కును చేరుకోలేకపోయినప్పటికీ నవంబర్, డిసెంబర్ నెలల్లో వరసగా లక్ష కోట్ల మైలు రాయిని దాటాయి. అయితే ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఈ లక్షం ఎక్కువేనని విశ్లేషకులు అంటున్నారు. చివరికి దీపావళి పండగ సీజన్లో కూడా జిఎస్టి వసూళ్లు కేవలం లక్ష కోట్ల మార్కును మాత్రమే తాకగలిగాయని వారంటున్నారు. కాగా పన్ను వసూళ్లను పెంచుకోవడానికి తప్పుగా, లేదా ఎక్కువ ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ తీసుకున్న వారికి, డిఫాల్టర్లు, జిఎస్టి రిటర్న్లు దాఖలు చేయని వారు, తమ రిటర్న్లలో సరిపోలని సమాచారం ఇచ్చిన వారు లాంటి వారిని డాటా అనలిటిక్స ద్వారా గుర్తించి, ఆ సొమ్మును స్వచ్ఛందంగా తిరిగి చెల్లించాలని కోరుతూ వారికి ఎస్ఎంఎస్లు, ఇమెయిల్స్ కూడా పంపిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి.