దున్నపోతు ప్రభుత్వం అక్రమ కేసులతో రైతులను బలి తీసుకుంటుంది!

     Written by : smtv Desk | Sun, Jan 19, 2020, 02:04 PM

దున్నపోతు ప్రభుత్వం అక్రమ కేసులతో రైతులను బలి తీసుకుంటుంది!

మాజీ మంత్రి నారా లోకేశ్ ట్విటర్ వేదికగా వైసీపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతుల్ని జగన్ చంపేస్తున్నారని, ఈ రైతుల మరణాలన్నీ ప్రభుత్వం చేస్తున్న హత్యలేనని ధ్వజమెత్తారు. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనల్లో మరణించిన వారి పేర్లను లోకేశ్ ప్రస్తావించారు. శాంతియుతంగా ఉద్యమంలో పాల్గొంటున్న కొడుకు, కోడలిపై అక్రమంగా కేసులు పెట్టి వారిని వేధింపులకు గురి చేశారని లోకేశ్ ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్వాకానికి మనస్తాపం చెందిన రైతు అబ్బూరి అప్పారావు ఆందోళనతో చనిపోయారని, మరో మహిళా రైతు సామ్రాజ్యమ్మ కూడా గుండె పోటుతో మరణించారని తెలిపారు. ఈ వ్యవహారంపై ఆదివారం మధ్యాహ్నం లోకేశ్ ట్విటర్ వేదికగా స్పందించారు. మరణించిన రైతుల అబ్బూరి అప్పారావు ఫోటోను కూడా షేర్ చేశారు. ఈ ఘటనలు తనను తీవ్రంగా కలచి వేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం కోసం త్యాగం చేసిన రైతులకి ఇలాంటి పరిస్థితి రావడం దారుణమని అన్నారు. ప్రభుత్వం చేసేది దొంగ పనులు కాబట్టే రాజధాని ప్రాంత గ్రామాల్లో వేల సంఖ్యలో పోలీసులను మోహరించారని విమర్శించారు. ప్రజల మధ్యలోంచి కాకుండా మరో దారిలో వెళ్లడానికి జగన్ కొత్త రోడ్డు వేయించుకున్నారని విమర్శించారు. ఆదివారం నారా లోకేశ్ మూడు ట్వీట్లు చేశారు. ‘‘రాజధాని కోసం స్వచ్ఛందంగా భూమి ఇచ్చిన రైతుల్ని వైఎస్ జగన్ గారు చంపేస్తున్నారు. ఈ దున్నపోతు ప్రభుత్వం అక్రమ కేసులతో రైతులను బలి తీసుకుంటుంది. రాజధాని తరలింపు ఆందోళనతో రైతుల మరణాలు అన్ని ప్రభుత్వ హత్యలే. శాంతియుతంగా ఉద్యమంలో పాల్గొంటున్న కొడుకు, కోడలిపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడంతో రైతు అబ్బూరి అప్పారావు ఆందోళనతో మృతి చెందారు. మహిళా రైతు సామ్రాజ్యమ్మ గుండె పోటుతో మరణించారు. ఈ ఘటనలు నన్ను తీవ్రంగా కలచివేసాయి. రాష్ట్రం కోసం త్యాగం చేసిన రైతులకి ఈ పరిస్థితి రావడం దారుణం. చేసేవి దొంగ పనులు కాబట్టే గ్రామాల్లో వేల సంఖ్యలో పోలీసులను దింపారు. ప్రజల మధ్యలోంచి కాకుండా జగన్ గారు దొంగ దారిలో వెళ్లడానికి కొత్త రోడ్డు ఏర్పాటు చేసుకున్నారు.’’ అని లోకేశ్ తెలుగులో ట్వీట్ చేశారు.











Untitled Document
Advertisements