ఢిల్లీ సీఎం కేజ్రీవాల్పై, ఆ పార్టీ ఎమ్మెల్యే ఆదర్శ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే టికెట్ కోసం సీఎం కేజ్రీవాల్ రూ. 10 కోట్లు డిమాండ్ చేశారని ఆయన ఆరోపించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 8న జరగనున్నాయి. ఎన్నికల్లో తిరిగి పోటీ చేయాలని ద్వారక ఎమ్మెల్యే ఆదర్శ్ శాస్త్రి భావించాడు. అయితే తనకు టికెట్ కేటాయింపు కోసం సీఎం కేజ్రీవాల్ తనను రూ. 10 కోట్లు డిమాండ్ చేశారని ఆయన అన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఆయనకు టికెట్ కేటాయించకపోవడంతో ఆదర్శ్ శనివారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ చోప్రా, ఏఐసీసీ ఇంఛార్జ్ పీసీ చాకో సమక్షంలో ఆదర్శ్ పార్టీలో చేరారు. అంత డబ్బు చెల్లించే స్థోమత తనకు లేదని.. అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరానని ఆయన అన్నాడు. ఆమ్ ఆద్మీ పార్టీ 2020 అసెంబ్లీ ఎన్నికల టికెట్లను రూ. 10 నుంచి 20 కోట్లకు అమ్ముకుంటుందని ఆయన ఆరోపించారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మనవడైన ఆదర్శ్.. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ ప్రతినిధి మరియు విదేశీ వ్యవహారాల సెల్ కో-కన్వీనర్ పదవులను కూడా నిర్వహించారు. ఆదర్శ్ కాంగ్రెస్లో చేరడంతో ఆ టికెట్ను వినయ్ మిశ్రాకు ఆప్ కేటాయించింది. ఆమ్ ఆద్మీ పార్టీ పశ్చిమ ఢిల్లీ లోక్సభ అభ్యర్థి, తన తండ్రి బల్బీర్ సింగ్ జఖర్ కూడా టికెట్ కోసం అరవింద్ కేజ్రీవాల్కు 6 కోట్ల రూపాయలు చెల్లించాడని బల్బీర్ కుమారుడు ఉదయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నా తండ్రి మూడు నెలల క్రితం రాజకీయాల్లో చేరారు. లోక్సభ టికెట్ కోసం అరవింద్ కేజ్రీవాల్కు రూ .6 కోట్లు చెల్లించారు. ఆ టికెట్ కోసం నా తండ్రి డబ్బులు చెల్లించినట్లు నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి’ అని బల్బీర్ సింగ్ జఖర్ కుమారుడు ఉదయ్ అన్నారు. కానీ, ఉదయ్ తండ్రి బల్బీర్ సింగ్ జఖర్ మాత్రం ఈ వ్యాఖ్యలను ఖండించారు.