మొదటి వారం రోజుల్లోనే 100 కోట్ల షేర్!

     Written by : smtv Desk | Sun, Jan 19, 2020, 06:17 PM

మొదటి వారం రోజుల్లోనే 100 కోట్ల షేర్!

మహేష్‌బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ఈనెల 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ సందర్భంగా ‘సరిలేరు నీకెవ్వరు’ బ్లాక్‌బస్టర్ కా బాప్ సెలబ్రేషన్స్‌ను వరంగల్‌లోని హన్మకొండ జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో అశేష అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, వరంగల్ సిపి రవీందర్‌తో పాటు చిత్ర బృందం పాల్గొంది. ఈ సందర్భంగా సూపర్‌స్టార్ మహేష్‌బాబు మాట్లాడుతూ “దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాలో ఎన్నో గొప్ప డైలాగ్స్ రాశాడు. ఎన్నో అద్భుతాలు చేశాడు. కానీ ‘రమణ లోడ్ ఎత్తాలిరా’ అనే డైలాగ్ మాత్రం భీభత్సంగా పేలింది. ఈ సినిమాకు యాక్షన్ కంపోజ్ చేసిన రామ్, లక్ష్మణ్ మాస్టర్స్‌కి, సినిమాటోగ్రాఫర్ రత్నవేలుకి, బెస్ట్ మ్యూజిక్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్‌కి థ్యాంక్స్. విజయశాంతితో ‘కొడుకు దిద్దిన కాపురం’ చిత్రానికి పనిచేశాను. ఆతర్వాత ఆమెతో 30 సంవత్సరాల తర్వాత ఈ సినిమాలో కలిసి పనిచేసే అవకాశం కలిగింది. ఆమెతో పనిచేయడం మరచిపోలేని అనుభవాన్నిచ్చింది. రష్మిక స్వీటెస్ట్ కో స్టార్. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మహర్షి చిత్రాల తర్వాత దిల్‌రాజుతో కలిసి ఈ సినిమాకు పనిచేయడం చాలా గొప్పగా ఉంది”అని అన్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ – “ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులందరికీ నా పాదాభివందనం. విజయశాంతిది వరంగల్. ఆమె మా సినిమాలో నటించినందుకు ధన్యవాదాలు. మహేష్ బాబు బ్యాటింగ్ మొదలైంది. మొదటి వారం రోజుల్లోనే 100 కోట్ల షేర్ తెచ్చారు. ఇంకా ఎంత దూరం తీసుకెళ్తారో తెలియదు. ఇది నాకు ఐదవ సినిమా. ప్రతి సినిమా హిట్ చేశారు. ప్రేక్షకుల వల్ల నెక్స్ లెవెల్ ఆఫ్ సక్సెస్ చూస్తున్నాను”అని చెప్పారు. లేడీ అమితాబ్ విజయశాంతి మాట్లాడుతూ – “13 ఏళ్ల తర్వాత ‘సరిలేరు నీకెవ్వరు’ అనే మంచి సినిమా నా దగ్గరికి రావడానికి ముఖ్య కారణం దర్శకుడు అనిల్ రావిపూడి. కథ నచ్చి చేసిన ఈ సినిమాతో హిట్ కొట్టాం. భారతి ప్రతి ఒక్కరి హృదయాల్లో నిలిచిపోయింది. సైనికుల తల్లి తండ్రుల బాధ ఏంటి అనేది అనిల్ చక్కగా, సందేశాత్మకంగా చూపించారు. సూపర్‌స్టార్ మహేష్ బాబుతో ’కొడుకు దిద్దన కాపురం’ సినిమాలో కలిసి నటించాను అది సూపర్ హిట్. ఇప్పడు ‘సరిలేరు నీకెవ్వరు’లో కలిసి నటించాను. ఇది సూపర్ డూపర్ హిట్. బాబుతో పని చేయడం చాలా కంఫర్ట్‌గా ఉంటుంది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రష్మిక మందన్న, దిల్‌రాజు, అనిల్ సుంకర, వంశీ పైడిపల్లి, దేవిశ్రీ ప్రసాద్, రాజేంద్ర ప్రసాద్, రామ్-,లక్ష్మణ్, అజయ్, మెహర్ రమేష్, బాబు, కౌముది, రచ్చ రవి తదితరులు పాల్గొన్నారు.





Untitled Document
Advertisements