దశాబ్దాల నాటి సమస్య...కేంద్రం జోక్యంతో ఓ కొలిక్కి!

     Written by : smtv Desk | Sun, Jan 19, 2020, 08:50 PM

దశాబ్దాల నాటి సమస్య...కేంద్రం జోక్యంతో ఓ కొలిక్కి!

దశాబ్దాల నుంచి పట్టిపీడిస్తున్న మొండి సమస్యల పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు.. అయోధ్య తీర్పు వంటి అతిసున్నితమైన సమస్యలను పరిష్కరించిన మోదీ సర్కార్.. తాజాగా త్రిపుర నిర్వాసితులైన బ్రూ తెగకు చెందిన ఆదీవాసీల సమస్యను ఓ కొలిక్కి తెచ్చింది. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా త్రిపురలో తలదాచుకుంటున్న ‘బ్రూ’ (రియాంగ్‌) జాతీయులకు ఉపశమనం కల్పించింది. 23 ఏళ్ల క్రితం మిజోరంలో ఘర్షణలతో పారిపోయి త్రిపురలో నివాసముంటున్న దాదాపు 30 వేలమంది ‘బ్రూ’ జాతీయులకు అక్కడే శాశ్వత నివాసం కల్పించాలని కేంద్రం, మిజోరం, త్రిపుర, బ్రూ ప్రతినిధుల మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో వీరు త్రిపురలో అన్నిహక్కులు పొందనున్నారు. మిజోరంలో 1997లో మిజో, బ్రూ జాతుల మధ్య తలెత్తిన ఘర్షణలతో 30 వేల మంది వరకూ బ్రూ జాతీయులు త్రిపురకు పారిపోయారు. ఇటు మిజోరం రప్పించక, అటు త్రిపుర వీరికి స్థిరనివాసం కల్పించకపోవడంతో నానా కష్టాలకు గురయ్యారు. చివరకు కేంద్రం చొరవతో వీరి సమస్యకు పరిష్కారం లభించింది. కేంద్ర ప్రభుత్వం వీరి అభివృద్ధికి రూ. 600 కోట్లను కేటాయించింది. ప్రతి కుటుంబానికి నివాసిత స్థలంతో పాటు రెండేళ్లపాటు ఉచిత రేషన్‌ లభిస్తుంది. ప్రతి కుటుంబానికి రూ. 4 లక్షలను ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తారు. ప్రతి ఒక్కరికి నెలకు రూ. 5000 చొప్పున రెండేళ్ల పాటు సాయం అందించనున్నారు. ‘బ్రూ’ జాతీయులకు త్రిపురలో శాశ్వత నివాసం కల్పించడంపై త్రిపురలోని ఆదీవాసేతర సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బ్రూ జాతీయులు నివాసం ఉంటున్న కంచన్‌పూర్‌ నుంచి వారిని తిరిగి మిజోరంకు పంపివేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి.





Untitled Document
Advertisements