రిలయన్స్ పెట్రోల్ బంకుల్లో అమ్మకాల వృద్ధి రేటు, ఇండస్ట్రీ రేటును మించింది. క్యూ3 ఫలితాల తర్వాత జరిగిన ఇన్వెస్టర్స్ ప్రెజెంటేషన్లో కంపెనీ ఈ విషయాలను బయటపెట్టింది. డిసెంబర్ త్రైమాసికంలో రిలయన్స్ పెట్రోల్ బంకులలో డీజిల్ అమ్మకాలు 11 శాతం పెరగగా, పెట్రోల్ అమ్మకాలు 15 శాతం పెరిగాయని కంపెనీ పేర్కొంది. ఈ అమ్మకాలు 1,394 రిలయన్స్ ఔట్ లెట్ల నుంచి జరిగాయని తెలిపింది. డీజిల్ అమ్మకాలలో ఇండస్ట్రీ గ్రోత్ రేట్ 0.2 శాతంగా, పెట్రోల్ గ్రోత్ రేట్ 7.1 శాతంగా ఉంది. ఒక ఔట్లెట్నుంచి సగటున నెలకు 342 కి.లీ (డీజిల్, పెట్రోల్) ను విక్రయించగలిగామని రిలయన్స్ పేర్కొంది. ఇది ప్రభుత్వం ఆయిల్ కంపెనీలయిన ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం విక్రయించిన దాని కంటే రెండింతలు ఎక్కువని తెలిపింది. దేశంలో ఆయిల్ డిమాండ్ అక్టోబర్–డిసెంబర్ మధ్య కాలంలో 3.2 శాతం పెరిగింది. పెట్రోల్ డిమాండ్ 7.1 శాతం, ఎల్పీజీ డిమాండ్ 15 శాతం వృద్ధి చెందింది. పెట్రోల్ కార్ల వాడకం పెరగడంతో పాటు, రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్, రూరల్ కనెక్టివిటీ మెరుగుపడడంతో పెట్రోల్ డిమాండ్ పెరిగిందని రిలయన్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఫెస్టివల్ సీజన్ తర్వాత టూరిస్ట్లు పెరగడంతో ఏటీఎఫ్(ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్) డిమాండ్ మెరుగుపడిందని తెలిపింది. ప్రస్తుత కస్టమర్లతో పాటు, కొత్త కస్టమర్లను ఆకర్షించడంతో ఏటీఎఫ్ అమ్మకాలు పెరిగాయంది. కొత్త మార్కెట్లో విస్తరించడంతో ఎల్పీజీ అమ్మకాలు 37 శాతం పెరిగాయని, డిసెంబర్ క్వార్టర్లో పెట్రోల్ రిటైల్ సేల్స్ రెవెన్యూ 5 శాతం పెరిగి రూ. 3,725 కోట్లుగా నమోదైందని తెలిపింది.