'మహానటి' చూశాక ఏడుపు వచ్చేసింది!

     Written by : smtv Desk | Mon, Jan 20, 2020, 12:15 PM

'మహానటి' చూశాక ఏడుపు వచ్చేసింది!

కెరీర్ తొలినాళ్లలోనే సావిత్రమ్మ బయోపిక్‌లో నటించే అవకాశం దక్కించుకుని పుణ్యం చేసుకున్నారు కీర్తి సురేష్. అయితే ఈ సినిమాను ఎన్ని సార్లు చూశానో కూడా గుర్తులేదని అంటున్నారు బాలీవుడ్ నటి జాన్వి కపూర్. ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘మహానటి సినిమాను ఎన్ని సార్లు చూశానో కూడా లెక్కలేదు. తొలిసారి సినిమా చూశాక ఏడుపు వచ్చేసింది. దాంతో వెంటనే కీర్తి సురేష్‌కు ఫోన్ చేసి ఏడ్చేశాను. ఎందుకు ఏడ్చానో తెలీదు కానీ సావిత్రి అంటే చాలా అభిమానం’ అని తెలిపారు. అంతేకాదు తనకు దక్షిణాది సినిమాల్లో నటించాలని ఉందని మనసులో మాటను బయటపెట్టారు. ఇప్పుడు బాలీవుడ్‌ ఏ స్థాయిలో ఉందో తెలుగు చిత్ర పరిశ్రమ కూడా అదే స్థాయిలో ఉందని అన్నారు. ‘మహానటి’ సినిమాను నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేశారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై ప్రియాంక దత్, స్వప్న దత్ సంయుక్తంగా నిర్మించారు. దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక జాన్వి విషయానికొస్తే.. 2018లో ‘ధడక్’ సినిమాతో ఆడియన్స్‌ మనసులు దోచేసుకున్నారు. రెండో సినిమాగా భారీ ప్రాజెక్ట్‌కు సంతకం చేశారు. ఐఏఎఫ్ తొలి మహిళా పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్‌లో నటిస్తున్నారు. దీంతో పాటు ‘దోస్తానా 2’, ‘తఖ్త్’, ‘రూహీ అఫ్జాహీ’ సినిమాలు కూడా ఉన్నాయి. 2020లో జాన్వి బిజీ బిజీగా ఉండబోతున్నారన్నమాట.





Untitled Document
Advertisements