భారత్‌కు ఎదురుదెబ్బ..గాయంతో ఓపెనర్ ఔట్!

     Written by : smtv Desk | Mon, Jan 20, 2020, 03:55 PM

భారత్‌కు ఎదురుదెబ్బ..గాయంతో ఓపెనర్ ఔట్!

న్యూజిలాండ్ పర్యటనకు ముందు భారతజట్టుకు షాక్ ఎదురయ్యే అవకాశముంది. భుజం గాయంతో ఓపెనర్ శిఖర్ ధావన్ పర్యటనకు అందుబాటులో ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. ఆస్ట్రేలియాతో ముగిసిన వన్డే సిరీస్‌లో ధావన్ రెండుసార్లు గాయపడ్డాడు. రెండో వన్డేలో బ్యాటింగ్ చేస్తుండగా పక్కటెముకల గాయానికి గురయ్యాడు. అనంతరం ఆ మ్యాచ్‌లో తను ఫీల్డింగ్‌కు దిగేలేదు. తాజాగా మూడో వన్డేలో తను భుజగాయానికి గురయ్యాడు. మూడో వన్డేలో ఆసీస్ బ్యాటింగ్ సందర్భంగా ధావన్ గాయపడ్డాడు. ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ కొట్టిన షాట్ ఆపే క్రమంలో తను గాయపడ్డాడు. దీంతో ఆ మ్యాచ్‌లో ధావన్ బ్యాటింగ్‌కు కూడా రాలేదు. మ్యాచ్ ముగిశాక తను భుజానికి పట్టితో కన్పించాడు. ఈక్రమంలో ఈనెల 24 నుంచి న్యూజిలాండ్‌లో ప్రారంభమయ్యే ఐదు టీ20ల సిరీస్‌కు తను దూరమయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఆదివారం మ్యాచ్ ముగిశాకా టీమిండియా..సోమవారం న్యూజిలాండ్‌కు బయల్దేరి వెళుతుంది. అయితే ఈ జట్టుతో ధావన్ వెళ్లే అవకాశం లేనట్లు తెలుస్తోంది. మరోవైపు గతేడాదిగా ధావన్‌ను గాయాలు పట్టిపీడిస్తున్నాయి. తొలుత వన్డే వరల్డ్‌కప్‌లో బొటనవేలికి గాయం కావడంతో తను టోర్నీని నుంచి అర్ధాంతరంగా నిష్క్రమించాడు. అనంతరం సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ ఆడుతుండగా మోకాలిగాయానికి గురయ్యాడు. ఈ గాయాల నుంచి కోలుకుని తాజా వన్డే సిరీస్‌లో బరిలోకి దిగితే రెండు గాయాలయ్యాయి. కివీస్ టూర్‌లో ధావన్ అందుబాటుపై త్వరలోనే బీసీసీఐ స్పష్టతనిచ్చే అవకాశముంది.






Untitled Document
Advertisements