కేంద్రానికి ఎస్‌బీఐ కీలక ప్రతిపాదనలు...ఉద్యోగులకు అదిరిపోయే బెనిఫిట్స్?

     Written by : smtv Desk | Mon, Jan 20, 2020, 04:08 PM

కేంద్రానికి ఎస్‌బీఐ కీలక ప్రతిపాదనలు...ఉద్యోగులకు అదిరిపోయే బెనిఫిట్స్?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న 2020-21 ఆర్థిక సంవత్సరానికి కొత్త బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ కేంద్రానికి పలు ప్రతిపాదనలు పంపింది. కేంద్ర ప్రభుత్వం వీటికి ఓకే చెబితే ఉద్యోగులకు ఎంతో ప్రయోజనం కలుగనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోందని ఎస్‌బీఐ అభిప్రాయపడింది. దేశీ జీడీపీ వృద్ధి రేటు తగ్గిందని, రానున్న రోజుల్లోనూ తక్కువ వృద్ధే నమోదు కావొచ్చనే అంచనాలున్నాయని, అలాగే అంతర్జాతీయంగా కూడా పరిస్థితులు ఆశాజనకంగా లేవని తెలిపింది. ఇలాంటి సమయంలో బడ్జెట్ ప్రవేశపెట్టడం కత్తి మీద సాము లాంటిదని అభిప్రాయపడింది.

ఉద్యోగుల కోసం ఎస్‌బీఐ తాజాగా కేంద్రానికి పలు బడ్జెట్‌ ప్రతిపాదనలు పంపింది. అవేంటో చూద్దాం..

1. పర్సనల్ ఇన్‌కమ్ ట్యాక్స్ తగ్గింపు:

వ్యక్తిగత ఆదాయ పన్ను తగ్గింపు వల్ల ఆర్థిక వృద్ధి రేటు పుంజుకోదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జనాభాలో కేవలం 4 శాతం మంది మాత్రమే పన్ను చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. అయితే ఎస్‌బీఐ మాత్రం దీనికి భిన్నంగా స్పందించింది. చెల్లించేవారు తక్కువ శాతం అయినా కూడా గత ఆర్థిక సంవత్సరం ప్రైవేట్ వినియోగంలో వీరి వాటా 40 శాతానికి పైగా ఉందని పేర్కొంది. పన్ను రేటు తగ్గిస్తే అప్పుడు దేశంలో వినియోగం పెరుగుతుందని, ఆర్థిక వృద్ధి పెరుగుదలకు ఇది కీలకమని ఎస్‌బీఐ తన నివేదికలో పేర్కొంది.

2. 80సీ పన్ను మినహాయింపు పెంపు:

మోదీ సర్కార్ ఈసారి బడ్జెట్‌లో 80సీ ట్యాక్స్ మినహాయింపు పరిమితి పెంచితే బాగుంటుందని ఎస్‌బీఐ అభిప్రాయపడింది. సెక్షన్ 80సీ కింద పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) పన్ను మినహాయింపు పరిమితిని పెంచాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. పన్ను మినహాయింపును రూ.2.5 లక్షలకు పెంచాలని సూచించింది.

3. హోమ్ లోన్ వడ్డీ రేటు మినహాయింపు:

స్టేట్ బ్యాంక్ హోమ్ లోన్ తీసుకున్న వారికి ప్రయోజనం కలిగే సిఫార్సు ఒకటి చేసింది. హోల్ లోన్ వడ్డీ రేటు మినహాయింపు పరిమితిని రూ.3 లక్షలకు పెంచాలని కోరింది. దీంతో దేశంలో దాదాపు 75 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని పేర్కొంది. ప్రస్తుతం హోమ్ లోన్‌ వడ్డీ రేటు చెల్లింపుపై రూ.2 లక్షల వరకు డిడక్షన్ పొందొచ్చు.

4. సీనియర్ సిటిజన్స్‌కు రిబేట్:

సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్‌సీఎస్ఎస్) కింద సీనియర్ సిటిజన్స్ రూ.15 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. దీనిపై 8.6 శాతం వడ్డీ వస్తుంది. అయితే ఈ వడ్డీ మొత్తంపై పన్ను పడుతుంది. అయితే ఈ స్కీమ్‌లో డిపాజిట్ చేసే మొత్తంపై వచ్చే వడ్డీకి రిబేట్ సదుపాయం కల్పించాలని ఎస్‌బీఐ సిఫార్సు చేసింది.





Untitled Document
Advertisements