సోమవారం సాయంత్రం 5 గంటలకు మునిసిపల్ ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. కనుక అన్ని పార్టీల నేతలు ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉన్నారు. హోంమంత్రి మహమూద్ అలీ, పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదివారం జనగామలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “కాంగ్రెస్, బిజెపిలు ముస్లింలు, బడుగు బలహీనవర్గాలను ఎప్పుడూ ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తుంటాయి. అందుకే వాటికి ఎన్నికలొచ్చినప్పుడే ముస్లింలు, బడుగు బలహీనవర్గాల ప్రజలు గుర్తొస్తుంటారు. కానీ సిఎం కేసీఆర్ అటువంటి వ్యక్తి కాదు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను ముఖ్యంగా...ముస్లింలు, బడుగు బలహీనవర్గాల ప్రజల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. కనుక ప్రజలకు దేవుడిచ్చిన బహుమతి కేసీఆర్. కాంగ్రెస్, బిజెపిలు రాజకీయాలు తప్ప మరేమీ చేయలేవు. అధికారంలో లేని పార్టీలకు ఓట్లువేసి గెలిపిస్తే అవి అభివృద్ధి చేయలేవు కనుక అభివృద్ధి కుంటుపడుతుంది. గతంలో పొన్నాల లక్ష్మయ్యను ఎన్నుకొన్నప్పుడు ఆయన జనగామను ఏమైనా అభివృద్ధి చేశారో లేదో మీకే తెలుసు. కనుక ఆ పార్టీల నేతల మాటలు నమ్మి వాటికి ఓట్లేస్తే మీ ఓట్లు చెత్తకుండీలో వేసినట్లే. రాష్ట్రాభివృద్ధికి...రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న టిఆర్ఎస్కే ఓట్లు వేసి గెలిపించాలని కోరుతున్నాము,” అని అన్నారు.