పంత్‌కి కీపర్‌గా ఎందుకు అవకాశం ఇవ్వలేదు?

     Written by : smtv Desk | Tue, Jan 21, 2020, 05:46 PM

పంత్‌కి కీపర్‌గా ఎందుకు అవకాశం ఇవ్వలేదు?

ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌లో రిషబ్ పంత్ గాయపడగా.. అతని స్థానంలో వికెట్ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన కేఎల్ రాహుల్.. మెరుగ్గా రాణించాడు. దీంతో.. ఇకపై రాహుల్‌నే కీపర్‌గా కొనసాగించబోతున్నట్లు విరాట్ కోహ్లీ దాదాపు స్పష్టం చేశాడు. అదే జరిగితే..? రిషబ్ పంత్ భవితవ్యమేంటి..? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఆస్ట్రేలియాతో వాంఖడే వేదికగా జరిగిన తొలి వన్డేలో పాట్ కమిన్స్ విసిరిన షార్ట్ పిచ్ బంతి రిషబ్ పంత్ బ్యాట్‌కి తగిలి అనంతరం హెల్మెట్‌ని తాకింది. దీంతో.. అతని తల అదరడంతో.. ఆ మ్యాచ్‌లో రిషబ్ పంత్‌ మళ్లీ మైదానంలో రాలేదు. కేఎల్ రాహుల్ కీపింగ్ బాధ్యతల్ని స్వీకరించాడు. ఆ తర్వాత రాజ్‌కోట్ వేదికగా జరిగిన రెండో వన్డేకి కూడా పంత్ దూరమవగా.. రాహుల్‌ని కొనసాగించిన టీమిండియా.. బెంగళూరు వన్డేలో పంత్‌ ఫిట్‌నెస్ సాధించినా..? తుది జట్టులోకి తీసుకోలేదు. ఈ మూడు వన్డేల్లోనూ బ్యాట్స్‌మెన్‌గా, కీపర్‌గా కేఎల్ రాహుల్ అంచనాలకి మించి రాణించాడు. బెంగళూరు వన్డేలో రిషబ్ పంత్‌ని పక్కన పెట్టడం గురించి తాజాగా గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ ‘బ్రేక్ తర్వాత ఫిట్‌నెస్ సాధించినా.. పంత్‌కి కీపర్‌గా ఎందుకు అవకాశం ఇవ్వలేదు. అతనికి ఏమైంది..? రాహుల్‌ని కీపర్‌గా కొనసాగించాలనుకుంటున్నారా..? ఆ విషయాన్ని అతనితో స్పష్టంగా చెప్పారా..? బ్యాట్స్‌మెన్, కీపర్‌గా రాహుల్ రాణించడం టీమ్‌కి బలమే. కానీ తుది నిర్ణయం తీసుకునే ముందు ఇద్దరి ఆటగాళ్లతో టీమిండియా మేనేజ్‌మెంట్ మనస్ఫూర్తిగా మాట్లాడాలి. ముఖ్యంగా రిషబ్ పంత్‌తో. ఎందుకంటే..? అతను ఇప్పటికే బ్యాటింగ్ టెక్నిక్ లోపంతో అభద్రతా భావంలో ఉన్నాడు. కాబట్టి అతనితో మేనేజ్‌మెంట్ చర్చించి.. ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటే మంచిది’ అని సూచించాడు.






Untitled Document
Advertisements