ఐపీఎల్ కోసం దేవాలయంలో కెప్టెన్‌గా ధోనీ ప్రత్యేక పూజలు..!

     Written by : smtv Desk | Tue, Jan 21, 2020, 06:50 PM

ఐపీఎల్ కోసం దేవాలయంలో కెప్టెన్‌గా ధోనీ ప్రత్యేక పూజలు..!

భారత్ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలని ఆశిస్తున్న మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ తాజాగా ఝార్ఖండ్‌లో ప్రాక్టీస్ మొదలెట్టాడు. గత ఏడాది వన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియాకి పూర్తిగా దూరమైపోయిన ధోనీకి ఇటీవల బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ని కూడా ఇవ్వలేదు. దీంతో.. అతను మళ్లీ భారత్ జట్టు తరఫున ఆడటం అనుమానమేనంటూ వార్తలు వస్తున్నాయి. మార్చి 29 నుంచి ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తుండగా.. ఈ టోర్నీలో ధోనీ రాణిస్తే..? అక్టోబరులో జరిగే టీ20 ప్రపంచకప్‌ కోసం అతని ఎంపికని పరిశీలిస్తామని ఇటీవల టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి స్పష్టం చేశాడు. దీంతో.. ఇప్పటి నుంచి ఐపీఎల్‌కి ధోనీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఝార్ఖండ్‌లోని ప్రసిద్ధ దేవాలయం ‘డియోరి’లో ప్రత్యేక పూజలు నిర్వహించి మరీ ఐపీఎల్‌ కోసం ధోనీ ప్రాక్టీస్ మొదలెట్టినట్లు సమాచారం. 2011లో వన్డే ప్రపంచకప్ ముంగిట ఈ దేవాలయంలో కెప్టెన్‌గా ధోనీ ప్రత్యేక పూజలు నిర్వహించాడు. ఆ టోర్నీలో విజేతగా నిలిచిన టీమిండియా.. భారత్‌కి 28 ఏళ్ల తర్వాత వరల్డ్‌కప్‌ని అందించిన విషయం తెలిసిందే. దీంతో.. మరోసారి ధోనీ ఆ ఆలయంలో పూజలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2004 నుంచి తొలిసారి బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్‌లో చోటు కోల్పోయిన ధోనీ.. ప్రస్తుతం కెరీర్‌లోనే అత్యంత సంక్లిష్ట దశని ఎదుర్కొంటున్నాడు.






Untitled Document
Advertisements