నల్సార్ లో బీసీ రిజర్వేషన్లపై స్పష్టత వచ్చేంత వరకూ నల్సార్ లా యూనివర్సిటీలో 2020–21 అకడమిక్ ఇయర్ ను ప్రారంభించవద్దని జాతీయ బీసీ కమిషన్ ఆదేశించిందని కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ చెప్పారు. తమ ఫిర్యాదుపై కమిషన్ స్పందించిందన్నారు. సోమవారం ఢిల్లీలో జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ భగవాన్ లాల్ సహాని అధ్యక్షతన, తెలంగాణ, ఏపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ న్యాయ విశ్వ విద్యాలయాల ఉన్నతాధికారులతో విచారణ జరిగింది. నల్సార్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ బాలకిష్టా రెడ్డి, సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్, పిటిషనర్ దాసోజు శ్రావణ్ పాల్గొన్నారు. తర్వాత శ్రావణ్ మీడియాతో మాట్లాడుతూ.. నల్సార్ లా యూనివర్సిటీలో 20 ఏళ్లుగా రిజర్వేషన్ల అమలులో బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు. బీసీలకు సీట్లు ఇస్తే నల్సార్ ప్రమాణాలు పడిపోతాయని వైస్ చాన్స్ లర్ బాధ్యతా రహిత్యంగా బదులిచ్చారని మండిపడ్డారు. అందుకే జాతీయ బీసీ కమిషన్ ను ఆశ్రయించామని, వైస్ చాన్ లర్ పై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసిందన్నారు.