ఏపీ సర్కార్ బడుల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు చేస్తున్నట్లు తెలిపారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మంగళవారం అసెంబ్లీలో అమ్మ ఒడి, మధ్యాహ్న భోజనం పథకాలపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన పుష్టికరమైన ఆహారాన్ని అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇందుకోసం మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు చేసి సరికొత్త మెనూను రూపొందించామని చెప్పారు. అంతేకాదు ఈ పథకానికి ‘జగనన్న గోరుముద్ద’గా కొత్త పేరు పెట్టినట్లు ప్రకటించారు. కొత్త మెనూ ఇవాళ్టి నుంచి అమలు చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే ఆయాలకు ఇచ్చే గౌరవ వేతనాన్ని కూడా వెయ్యి రూపాయల నుంచి మూడువేల రూపాయలకు పెంచామన్నారు సీఎం జగన్ .దీంతో ప్రభుత్వంపై రూ.344 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యతను పెంచేందుకు నాలుగంచెల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పాఠశాల అభివృద్ధి కమిటీ నుంచి ముగ్గురు సభ్యులకు పర్యవేక్షణ బాధ్యత అప్పగిస్తున్నామన్నారు. వీరితో పాటు వార్డు, గ్రామ సచివాలయంలో ఉండే విద్య, సంక్షేమ అధికారి నాణ్యతను పరిశీలించేలా ఏర్పాట్లు చేపట్టనున్నట్లు తెలిపారు. వీరందరిపై ఆర్డీవో స్థాయి అధికారి పర్యవేక్షణ ఉంటుందన్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.