తెలంగాణలోనూ జనసేనతో పొత్తు!

     Written by : smtv Desk | Mon, Jan 27, 2020, 08:14 PM

తెలంగాణలోనూ జనసేనతో పొత్తు!

తెలంగాణలోనూ జనసేనతో కలిసి పనిచేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ తెలిపారు. త్వరలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌తో భేటీ అవుతామని వెల్లడించారు. ఈ అంశంపై పవన్‌తో ఇప్పటికే ఫోన్‌లో మాట్లాడామని తెలిపారు. మున్సిపాలిటీల్లో ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నిక నేపథ్యంలో సోమవారం (జనవరి 27) ఆయన మీడియాతో మాట్లాడారు. మెజార్టీ లేకపోయినా దొడ్డి దారిలో టీఆర్‌ఎస్ ఛైర్మన్ పదవులను దక్కించుకుందని మండిపడ్డారు. మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అనైతిక చర్యలకు పాల్పడిందని లక్ష్మణ్‌ ధ్వజమెత్తారు. బీజేపీ గెలిచిన తుక్కుగూడ మున్సిపాలిటీలో ప్రజా తీర్పును వమ్ము చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 100 సీట్లు గెలిచినా ఆ పార్టీకి అధికార దాహం తీరలేదని ఎద్దేవా చేశారు. బీజేపీ గెలిచిన ఒక్క మున్సిపాలిటీని కూడా ఇలా చేయడం సరికాదన్నారు. తుక్కుగూడ ఎన్నికపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. దేశంలో బీజేపీతో కలిసి పనిచేసేందుకు పవన్‌ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అన్ని రాష్ట్రాల్లోనూ పవన్‌ సేవలు ఉపయోగించుకుంటామని తెలిపారు. జనసేన - బీజేపీ కలిసి పనిచేసి రాష్ట్రంలో కేసీఆర్‌ అవినీతి, కుటుంబ పాలనను దించుతామని ఆయన పేర్కొన్నారు. జనసేన పార్టీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీతో కలిసి పనిచేయడానికి అవగాహన కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.





Untitled Document
Advertisements