ముంభైలో ఐపీఎల్2020 ఫైనల్...!

     Written by : smtv Desk | Mon, Jan 27, 2020, 08:38 PM

ముంభైలో ఐపీఎల్2020 ఫైనల్...!

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ లీగ్‌గా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌కు ఎంతగానో పేరుంది. ఐపీఎల్లో ఆడాలని ఎంతోమంది క్రికెటర్లు కలలు కంటూ ఉంటారు. ఐపీఎల్‌కు తలమానికంగా ఫైనల్ మ్యాచ్‌ను పేర్కొంటారు. టోర్నీ ముగింపు వేడుకలతోపాటు ట్రోఫీని కూడా ఈ మ్యాచ్‌లోనే విజేతలకు అందజేస్తారు. ఇంతటి ప్రాముఖ్యమున్న ఈ మ్యాచ్‌కు అతిరథ మహారథులు ఎందరో హాజరవుతారు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ ఫైనల్ ఎక్కడ జరగనుంది అనే దానిపై బీసీసీఐ వర్గాలు స్పష్టతనిచ్చాయి. సోమవారం ఐపీఎల్ సమావేశం ముగిశాక బోర్డు వార్గాలు.. ముంబైలనే ఫైనల్‌ను నిర్వహిస్తామని పేర్కొంటున్నాయి. అంతకుముందు గుజరాత్‌లో నిర్మితమవుతున్న మోతెరా స్టేడియంలో ఫైనల్‌ను నిర్వహిస్తామని ఊహాగానాలు చెలరేగిన సంగతి తెలిసిందే. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రస్తుతం అహ్మదాబాద్‌లో నూతన క్రికెట్ స్టేడియం నిర్మాణం జరుగుతుంది. పాత మొతెరా స్టేడియాన్ని కూల్చి, కొత్తగా భారీ స్టేడియాన్ని కడుతున్నారు. నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే, ప్రపంచంలోని అతిపెద్ద స్టేడియంగా రికార్డు దక్కించుకుంటుంది. అందుకే ఇక్కడ ఐపీఎల్ ఫైనల్ నిర్వహిస్తారనే ప్రచారం జరిగింది. అతిపెద్ద స్టేడియం రికార్డు ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియం (ఎంసీజీ) పేరిట ఉంది. ఇక్కడి స్టేడియంలో కూర్చుని ఒకేసారి లక్ష మందికిపైగా మ్యాచ్ చూడవచ్చు. అయితే మొతెరా స్టేడియం అందుబాటులోకి వస్తే లక్షా పదివేల మంది సామర్థ్యంతో కొత్త రికార్డు దక్కించుకుంటుంది. ఐపీఎల్ నిర్వహించే నాటికి స్టేడియం పూర్తవుతుందని, టోర్నీ ఫైనల్‌ను ఈ స్టేడియంలో జరిపి ఘనంగా మెగాటోర్నీకి ముగింపు పలకాలని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నట్టు ప్రచారం జరిగిన సోమవారం సమావేశం అనంతరం ముంబైలోనే ఫైనల్ నిర్వహిస్తామని బోర్డు తేల్చిచెప్పింది. నిజానికి ఇప్పటివరకు ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లతోపాటు ఫైనల్ మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ గడ్డపైనే నిర్వహించడం ఒకట్రెండుసార్లు మినహా ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి కూడా ఐపీఎల్ ఫైనల్‌ను ముంబైలో నిర్వహిస్తామని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ముంబై ఇండియన్స్ తన ప్రారంభమ్యాచ్ ఇక్కడ ఆడనుంది. నిజానికి ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లు ఎక్కడ నిర్వహించాలనే అధికారం ఫ్రాంచైజీలకు ఉంటుంది. హోమ్‌టీమ్ మ్యాచ్‌లను ఎక్కడ నిర్వహించాలనే వాటిపై జట్ల యాజమాన్యాల నిర్ణయమే ఫైనల్. అయితే ఐపీఎల్ నాకౌట్ మ్యాచ్‌లను ఎక్కడ నిర్వహించాలి అనేదానిపై బీసీసీఐదే తుది నిర్ణయం. గతేడాది ఐపీఎల్ ఫైనల్‌ను హైదరాబాద్‌లో నిర్వహించడం ఈ కోవకిందకే వస్తుంది. నిజానికి చెన్నైలో జరగాల్సిన ఫైనల్‌ను భాగ్యనగరంలో నిర్వహించారు. ఈసారి మాత్రం ముంబైలోనే మ్యాచ్ జరుగుతుందని బోర్డు తెలిపింది. లీగ్ మ్యాచ్‌ల నుంచి వచ్చే ఆదాయంలో సింహభాగం ఫ్రాంచైజీలకు వెళుతుంది. మరోవైపు నాకౌట్ మ్యాచ్‌ల్లో వచ్చే ఆదాయం బీసీసీఐ తీసుకుంటుంది. ఈక్రమంలోనే అత్యధికంగా ఆదాయం వచ్చే వేదికలపై నాకౌట్ మ్యాచ్‌లను నిర్వహించేందుకు బోర్డు మొగ్గు చూపుతుంది. గతేడాది స్టాండ్స్‌కు సంబంధించిన వివాదం కారణంగానే ఫైనల్‌ను చెన్నై నుంచి హైదరాబాద్‌కు తరలించారు. దీంతో ఈ ఏడాది మొతెరా లాంటి అతిపెద్ద స్టేడియంలో ఫైనల్‌ను నిర్వహిస్తే రెవెన్యూ పరంగా ఉపయుక్తంగా ఉంటుందని బీసీసీఐ భావిస్తున్నట్లు కొందరు ప్రచారం చేసినా.. సోమవారం బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఈ ఊహాగానాలకు తెరదించారు. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం సోమవారం జరిగింది. ఐపీఎల్ 2020 షెడ్యూల్ త్వరలోనే విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది. ప్రస్తుతానికైతే మార్చి 29-మే24 మధ్య ఐపీఎల్ నిర్వహించనున్నారని ప్రచారం జరుగుతుంది. ఒకసారి ఐపీఎల్ షెడ్యూల్ విడుదలైతే టోర్నీ తేదీలపై స్పష్టత రానుంది.





Untitled Document
Advertisements