ఎయిర్ ఇండియా వాటాల విక్రయం : కేంద్రానికి బిజేపీ ఎంపీ షాక్

     Written by : smtv Desk | Mon, Jan 27, 2020, 08:55 PM

ఎయిర్ ఇండియా వాటాల విక్రయం : కేంద్రానికి బిజేపీ ఎంపీ షాక్

దేశ ఆర్థిక వ్యవస్థ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. మోదీ ప్రభుత్వం కూడా ప్రతికూల అంశాలతో సతమతమౌతోంది. ప్రభుత్వానికి అంచనా వేసిన స్థాయిలో ఆదాయం రావడం లేదు. దీంతో డిజిన్వెస్ట్‌మెంట్ ప్రణాళికలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే ప్రభుత్వ రంగ సంస్థల్లోని కేంద్ర వాటాలను విక్రయిస్తూ వస్తోంది. ఎయిర్ ఇండియా‌ నుంచి పూర్తిగా తప్పుకోవాలని కేంద్రం భావిస్తోంది. అందుకే ఎయిరిండియాలో 100 శాతం వాటా విక్రయానికి మోదీ సర్కార్ రెడీ అయ్యింది. అయితే ఇక్కడే కేంద్రానికి గట్టి షాక్ తగిలింది. ప్రతిపక్షాలు కేంద్రాన్ని విమర్శించడం సర్వసాధారణం. అయితే ఇక్కడ ఎయిర్‌ ఇండియా విక్రయంపై విపక్షాలకు తోడు సొంత పార్టీ ఎంపీ కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆయన మరెవరో కాదు.. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి. ప్రభుత్వ రంగ కంపెనీ ఎయిరిండియాలో వాటాలను పూర్తిగా విక్రయించడానికి ముందడుగు వేస్తే తాను న్యాయస్ధానాన్ని ఆశ్రయిస్తానని సుబ్రహ్మణ్యస్వామి హెచ్చరించారు. ఎయిర్‌ ఇండియా విక్రయ ప్రక్రియపై ఈయన స్పందిస్తూ.. ఇది జాతి వ్యతిరేక నిర్ణయమని ట్వీట్‌ చేశారు. మరోవైపు మోదీ ప్రభుత్వపు ఎయిరిండియా విక్రయంపై ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా విరుచుకుపడింది. ‘ప్రభుత్వం వద్ద డబ్బు లేకుంటే ఇలాంటి పనులు చేస్తుంది. కేంద్రం వద్ద డబ్బుల్లేవ్‌.. వృద్ధి 5 శాతం దిగువకు పడిపోయింది. జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూ.కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. విలువైన ఆస్తులను విక్రయిస్తున్నారు’ అని కాంగ్రెస్‌ నేత కపిల్‌ సిబల్‌ ఎద్దేవా చేశారు. కాగా కేంద్ర ప్రభుత్వం సోమవారం ఎయిర్ ఇండియాలో వంద శాతం వాటాలను విక్రయిస్తామని ప్రకటించింది. నష్టాల్లో కూరుకుపోయిన ఎయిర్‌ఇండియా అమ్మకానికి సంబంధించి ప్రిలిమనరీ బిడ్లను కూడా ఆహ్వానించింది. దీనికి మార్చి 17ను డెడ్‌లైన్‌గా నిర్ణయించింది.






Untitled Document
Advertisements