ఏపీ శాసన మండలి రద్దు తీర్మానంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు. గతంలో రద్దయిన శాసన మండలిని వైఎస్ రాజశేఖర్ రెడ్డి పునరుద్దరించారని మళ్ళీ ఇప్పుడు మండలిని రద్దు చేయడం సవ్యమైన చర్య కాదని అన్నారు. రాజ్యాంగ రూపకర్తలు ఎంతో మంది ముందు చూపుతో రాష్ట్రాలలో రెండు సభల ఏర్పాటుకు అవకాశం కల్పించారని అన్నారు.
అయితే ఏదైనా ఒక బిల్లుపై శాసన సభలో పొరపాటు నిర్ణయం తీసుకున్నప్పుడు దానిపై పెద్దల సభలో మేధోపరమైన మధనం చేసి అటువంటి బిల్లులను సరిదిద్దడానికి శాసన మండలిని రూపకల్పన చేశారని, అంతటి ఉన్నత ఆశయంతో ఏర్పాటైన మండలిని మన రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో రద్దు చేయడం సబబు కాదని జనసేన భావిస్తుందని పవన్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యవస్థలను తొలగించుకుంటూ పోవడం రాజ్యాంగ స్పూర్తికి విరుద్దం అని, శాసన మండలి రద్దుకు ప్రజల ఆమోదం ఉందా, లేదా అనే అంశాన్ని ఎక్కడా పరిగణలోకి తీసుకున్నట్టు కనిపించడం లేదని అన్నారు. మండలి రద్దుతో మేధావుల ఆలోచనలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి ఉపయోగించే అవకాశం మనం కోల్పోయామని పవన్ భావించారు.