26 ఏళ్లకే తొలి మేయర్‌గా ఎన్నికై మహిళా రికార్డు

     Written by : smtv Desk | Tue, Jan 28, 2020, 11:48 AM

26 ఏళ్లకే  తొలి మేయర్‌గా ఎన్నికై మహిళా రికార్డు

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌‌కే మేయర్‌గా ఎన్నికైన మహిళ రికార్డు నెలకొల్పారు. ఎందుకంటే మేయర్ అయిన అతి పిన్న వయస్కురాలు ఆమె కావడం విశేషం. కేవలం 26 ఏళ్ల వయసుకే కార్పొరేషన్‌ తొలి మేయర్‌గా ఎన్నికై మేకల కావ్య రికార్డు సృష్టించారు. జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌కు తొలిసారిగా జరిగిన ఎన్నికలో 28 డివిజన్లకు ఏకంగా 20 డివిజన్లు టీఆర్‌ఎస్‌ గెలుచుకున్న సంగతి తెలిసిందే. 15వ డివిజన్‌ నుంచి పోటీ చేసిన మేకల కావ్య కార్పొరేషన్‌లోనే 900కు పైగా ఓట్లతో అత్యధిక మెజారిటీ సాధించారు. మంత్రి మల్లారెడ్డికి బాగా సన్నిహితుడిగా ఉన్న జిల్లా టీఆర్‌ఎస్‌ నాయకుడు మేకల అయ్యప్ప కుమార్తె ఈ మేకల కావ్య. ఆమె ఏకంగా మేయర్‌ పదవితోనే తన రాజకీయ అరంగేట్రం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మేకల కావ్య సికింద్రాబాద్ మారేడ్‌పల్లి నారాయణ స్కూల్‌లో పదో తరగతి చదివారు. ఈసీఐఎల్‌‌లోని నారాయణ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. తర్వాత శ్రీనిధి ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్ పూర్తి చేశారు. 2017 మార్చి 16న వివాహమైంది. ఈమెకు రెండేళ్ల కుమార్తె కూడా ఉన్నారు. ప్రస్తుతం అదే కార్పొరేషన్‌ పరిధిలోని 15వ డివిజన్‌లో నివసిస్తున్నారు. భర్త సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. తొలిసారిగా కావ్య కార్పొరేటర్‌గా అత్యధిక మెజారిటీతో గెలుపొందడంలో సోదరుడు, టీఆర్‌ఎస్‌ యువ నాయకుడు మేకల భార్గవరాం కీలకపాత్ర పోషించారని తెలుస్తోంది. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన 120 పురపాలక సంఘాల్లో 118 మున్సిపల్ ఛైర్ పర్సన్ పదవులకు సోమవారం జరిగిన పరోక్ష ఎన్నికల్లో టీఆర్ఎస్ 110, కాంగ్రెస్ నాలుగు, బీజేపీ 2, ఎంఐఎం 2 దక్కించుకున్న సంగతి తెలిసిందే. 9 కార్పొరేషన్ పరోక్ష ఎన్నికల్లో అన్నింటిలోనూ టీఆర్ఎస్ జెండా పాతింది. కాంగ్రెస్ ఏడు చోట్ల ఎక్కువగా వార్డులు గెలిచినా.. వాటిలో రెండింటిని మాత్రమే నిలబెట్టుకోగలిగింది.





Untitled Document
Advertisements